టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు… ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మరోవైపు… పోటాపోటీగా మోహరించాయి. సై అంటే సై అంటున్నాయి. ఉపాధ్యాయ సంఘాలైన ఎస్టీయూ, యూటీఎఫ్ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపగా, అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ కూడా తాజాగా మద్దతు తెలిపింది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో అది కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నియోజక వర్గమైన గజ్వేల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకంగా జేఏసీ ఏర్పాటు చేసి సమర శంఖం పూరించాయి. ఈ పరిణామాలు ఇంకా ఎక్కడిదాకా వెళతాయి? ఎవరు తగ్గుతారు? ఎవరు నెగ్గుతారు?
- సకల జనుల సమ్మె?
- ప్రజల మద్దతు కూడగడదాం.. ఆందోళనను ఉధృతం చేద్దాం
- అఖిలపక్ష సమావేశంలో పిలుపు.. 19న రాష్ట్ర బంద్కు యోచన
- కార్యాచరణపై నేడు భేటీ.. టీఎన్జీవో, టీజీవోలూ రావాలి: అశ్వత్థామ
- సెల్ఫ్ డిస్మిస్ అని పిచ్చోడూ అనడు.. ‘మద్దతు’పై పునరాలోచన: చాడ
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మారుద్దామని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను కాపాడుకునేందుకే కార్మికులు సమ్మె చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తద్వారా ప్రజల మద్దతును కూడగట్టాలని, ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 19న బంద్ను చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు, మరిన్ని సంఘాల మద్దతును కూడగట్టే దిశగా చర్చించేందుకు గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ యూనియన్లు, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో.. టీఎ్సఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం బుధవారం జరిగింది. జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధపార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. తాము జీతభత్యాల కోసం సమ్మె చేయడంలేదని, ఆర్టీసీని కాపాడుకునేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నామని తెలిపారు. తమ సమ్మెను సీఎం కేసీఆర్ వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తమ వెంట పార్టీలు నిలిస్తే మరింత ముందుకు సాగుతామన్నారు.
టీఎన్జీవోలు, టీజీవోలూ తమతో కలిసిరావాలని అన్నారు. సకలజనుల సమ్మెలోనూ వాళ్ల స్ఫూర్తితోనే తాము ఉద్యమించామని అన్నారు. అన్ని పార్టీల నేతలూ ఆర్టీసీ యూనియన్లకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారని, వారిలో ఎక్కువ మంది టీఆర్ఎస్ నేతలే అని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లెవరూ తమ దగ్గరకు రావడంలేదని వాపోయారు. చత్తీ్సగఢ్లో ఆర్టీసీ ఉండేదని, అక్కడ మాజీ సీఎం అజిత్జోగి కుమారుడికి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ కోసం సంస్థను లేకుండా చేశారని అన్నారు. కార్మికులు, ఉద్యోగుల ఉసురు తగిలి అజిత్ జోగి వీల్చైర్కే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. తెలంగాణ టీచర్స్ ఫెఢరేషన్, యూటీఎఫ్, ఓయూ జేఏసీ, ఏఐఎ్ఫటీయూ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెఢరేషన్, సీపీఐ (ఎంల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీవైఎల్తోపాటు పలు సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఉద్యోగాలు ఇవ్వడం సులువైన పనే అని, ఊడబీకడం చాలా కష్టమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశద్రోహానికి పాల్పడినప్పుడు తప్ప ఏ సందర్భంలోనూ ప్రభుత్వ ఉద్యోగిని తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా పనిచేస్తే నడవబోదని హెచ్చరించారు. కేసీఆర్ నిరంకుశపాలన అంతం చేయాలన్న ఆలోచనతో సమాజంలోని అన్నివర్గాలూ ఏకం అయ్యాయయని అన్నారు. ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వమే కారణమని, ఆర్టీసీకి రాయితీల బకాయిలు, ప్రత్యేక నిధులు ఇచ్చి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం సీఎం కేసీఆర్కు ఉండబోదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు స్పష్టం చేశారు.
ఆంధ్రా పాలకులే నయం!: జిట్టా సకలజనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రెండు రోజులు సమ్మెలో కొనసాగితేనే 50వేల మందిపై తెలంగాణ రాష్ట్రంలో వేటు పడిందని జాగో తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి వాపోయారు. ఆంధ్రాపాలకులే నయమనే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని విమర్శించారు.
Courtesy Andhra Jyothy..