న్యూఢిల్లీ : భారతీయులకు శుభవార్త. సరిగ్గా మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. అంటే అక్టోబర్ నెల చివర్లోగా కోవిషీల్డ్ అన్న కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ…
భారత ప్రభుత్వం ఈ విషయంలో మాకు లైసెన్స్ ఇచ్చింది. దీని కింద ట్రయల్స్ ప్రొటోకాల్ను మేము వేగవంతం చేశాము. ఈ ట్రయల్ మరో 58 రోజుల్లోనే పూర్తవుతుంది. మూడో దశ ట్రయల్ లో ఇవ్వాల్సిన మొదటి మొతాదును శనివారమే ఇచ్చామని, రెండో మోతాదును మాత్రం 29 రోజుల తర్వాత ప్రయోగిస్తామని పేర్కొన్నారు. రెండో మోతాదు ఇచ్చిన 15 రోజుల తర్వాత తుది నిర్ణయం తెలుస్తుంది. దీని తర్వాతే కోవి షీల్డ్ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని మేము సర్వ సన్నద్ధమవుతున్నాం అని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మరో వైపు ఈ సంస్థ ప్రతినిధులు శనివారం నుంచే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 17 కేంద్రాల్లో ట్రయల్స్ను ముమ్మరం చేసేశారు.
ప్రతి కేంద్రంలో సుమారు వంద మందిపై ఈ ట్రయల్స్ను చేయనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ సీరం ఇనిస్టిట్యూట్ వారిదని సమాచారం. వారు ఆస్ట్రా జెనెకా సంస్థ నుంచి వీరు తయారీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. సీరం ఇనిస్టిట్యూట్ నుంచి నేరుగా వ్యాక్సిన్ను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. నేరుగా కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగానే ఇస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం.
Courtesy Navatelangana