– రైతు సంక్షేమంటూనే సర్కారు నిర్లక్ష్యం
– నిధుల ఎగనామం
– గల్లా పెట్టే ఖాళీతో ముందుకు సాగని పథకాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలకు నిధుల కొరత వెంటాడుతున్నది. రైతు బంధు, పావలావడ్డీ, రుణమాఫీ, డ్రీప్, వ్యవసాయ యాంత్రీకరణ, ఆర్కేఈవై పథకాలకు కేటాయించిన నిధులు పెండింగ్లో ఉన్నాయి. రైతాంగానికి ప్రయోజనం కలిగే పథకాలకు నిధులు విడుదల చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు పథకాల గురించి ఉదరగొట్టిన అధికార పార్టీ… ఆ పథకాలకు నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలుకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. వందల కోట్లు కూడా విడుదల చేయలేదు.
ఫలితంగా రైతులు తమ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తున్నది. రైతుబంధు, రుణమాఫీ, పంట బీమా, వడ్డీలేని రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో చెల్లించాల్సిన రాష్ట్ర వాటా చెల్లింపులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. నిధుల విడుదలలో జాప్యంతో రైతులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.
అందని పంట బీమా పరిహారం
రైతులు పండించిన పంట ప్రకృతి వైఫరీత్యాలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. దీనికి సంబంధించి బీమా ప్రీమియంతో రైతు వాటా పోను మిగతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేప్పుడే పంట బీమా ప్రీమియం మినహయించుకుని చేసుకుని రుణాలు ఇస్తారు. ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడం, మరోవైపు బీమా కంపెనీల నిర్లక్ష్యంతో పంట నష్ట పరిహారం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2018 ఖరీఫ్ పంటల బీమా పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ 200కోట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏడాదైనా ప్రభుత్వం చెల్లించక పోవడంతో గత ఏడాది ఖరీఫ్కు సంబంధించిన పంట బీమా పరిహారం రైతులకు అందలేదు. గతేడాది 2017కు సంబంధించి పంట బీమా పరిహారం కూడా ఇప్పటి వరకు అందడం లేదని డోర్నకల్ మండలానికి చెదిన వందలాది మంది రైతులు వారానికి ఒక్కసారి వ్యవసాయశాఖ కమిషనరేట్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
ఆర్కేవీవై ఆగమాగం
వ్యవసాయ యాంత్రీకరణ, పంట తెగుళ్ళ నివారణ, ఉద్యానవన అభివృద్ధి, పరిశోధన, పశుపోషణ, పాల కేం ద్రాలు, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ క్రిషీ వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్రం వాటా 60శాతం, రాష్ట్రం వాటా 40శాతం ఇవ్వాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటా చెల్లిస్తున్నా… కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండో విడత నిధులు రావడం లేదు. గత నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవైకి నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నది. దీంతోపాటు ఖర్చుల వివరాలు వెల్లడించక పోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ 600 కోట్లుకు పైగా నిధులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రం నిధులు ఇవ్వక, కేంద్రం నిధులు రాక ఇబ్బంది ఎదురవుతున్నది. దీంతో రైతాంగానికి ఉపయో గపడే కార్యక్రమాలకు వెచ్చించే ఆర్కేవీవై పథకం నిరుప యోగంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడియాశలైన రైతు బంధు
రాష్ట్రంలో ఖరీఫ్ పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది. రైతుబంధు పథకం కింద 56.75లక్షల మందికి అమలు చేస్తున్నది. దీని కోసం రూ 7254కోట్లు కావాల్సివుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 42లక్షల మంది రైతులకు రూ 4862కోట్లు మాత్రమే చెల్లించింది. బడ్జెట్లో మాత్రం రూ 6900కోట్లు కేటాయించినా, నిధులు మాత్రం ఇవ్వలేదు. మరో 13.50 లక్షల మందికి రైతు బంధు అందనేలేదు. దీని కోసం రూ 2వేల కోట్లు అవసరం ఉన్నది.
రైతు రుణమాఫీ
రైతు రుణమాఫీ ప్రకటించి బడ్జెట్లో మొదటి విడత నిధులు రూ 6000కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదు. దీంతో 48.14లక్షల మందికి రూ 31.824కోట్లు ఇప్పటి వరకు అమలు కాకుండా పెండింగ్లోనే కొనసాగుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ అమలు చేయకపోవడంతో పంట బీమా, వడ్డీలేని రుణాలపై ప్రభావం పడుతున్నది. బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో ప్రయివేటు వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పులతో రైతులు సతమతమవుతున్నారు.
వడ్డీలేని రుణాలకు మోక్షమెప్పుడో
బ్యాంకులో రైతు తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకులు సాధారణంగా వసూలు చేసే వడ్డీ మొత్తంగా 7శాతం. కేంద్ర ప్రభుత్వం 3శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ కింద బ్యాంకులకు చెల్లిస్తాయి. దీంతో రైతుకు వడ్డీ లేని రుణం అమలవుతున్నది. అయితే గత నాలుగేండ్లుగా రైతులకు అందించాల్సిన వడ్డీలేని రుణాలను ప్రభుత్వం చెల్లించక పోవడంతో పేరుకుపోయాయి.
2015-16 నుంచి 2018-19 వరకు నాలుగేండ్లుగా రూ 815 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా వసూలు చేసుకున్నాయి. వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తున్నదని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
Courtesy Nava telangana…