భారత్లో 10,000 మందిపై వేటు!?
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లోనూ కొలువుల కోత ప్రారంభమైంది. అంతర్జాతీయ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్, భారత్తో సహా అనేక దేశాల్లో 25,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించబోతోంది. ఇం దులో 10,000 మంది భారత్లోని యూనిట్ల నుంచి ఉంటారని అంచనా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాక్సెంచర్ కంపెనీలో 5.13 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు రెండు లక్షల మంది భారత్లోనే ఉన్నారు.
పనితీరు పేరుతో కోతలు
పనితీరు మదింపు ఆధారంగా అయిదు శాతం మంది ఉద్యోగుల్ని తొలిగిస్తామని యాక్సెంచర్ కంపెనీ సీఈఓ జూలియస్ స్వీట్ ప్రకటించారు. కోవిడ్తో వ్యాపారం మందగించడంతో కంపెనీ ఇప్పటికే బ్రిటన్లో 900 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. కంపెనీ ఆస్ట్రేలియా యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. కోవిడ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు తగ్గాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతున్నాయి. చాలా కంపెనీలు ఈ సంవత్సరం జీతాల పెంపునూ పక్కన పెట్టాయి.
ఏటా మామూలే
యాక్సెంచర్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్లోనే ఉన్నారు. తీసివేతల ప్రభావం భారత్లో పెద్దగా ఉండదని కంపెనీ అధికారులు చెబుతున్నా, ఉద్యోగులు మాత్రం ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తీసివేతల కోసం ఇప్పటికే పనితీరు మదింపు ప్రారంభమైనట్టు సమాచారం. యాక్సెంచర్ ఇండియా అధికారులు మాత్రం పనితీరు సరిగా లేని ఉద్యోగుల తొలగింపు ఏటా ఉండేదేనంటున్నారు. వీరి సంఖ్య మహా అయితే అయిదు శాతం మించదని, వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని చేర్చుకుంటామని చెబుతున్నారు.
Courtesy Andhrajyothi