హైదరాబాద్, నిజామాబాద్, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువమంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 57 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీటిలో 8,446 పడకలుండగా.. ప్రస్తుతం 2,216 రోగులు ఉన్నారు. 6,230 పడకలు ఖాళీగా ఉన్నాయి.ప్రైవేటులో 5,013 పడకలు ఉండగా 3,269 మంది చికిత్స పొందుతున్నారు. 1,744 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ప్రైవేటులో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యనే ఎక్కువని స్పష్టమవుతోంది. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం తమ వద్ద పడకలు లేవని చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ తాజా వివరాల ద్వారా.. ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నది తప్పని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పరీక్షల సంఖ్యతో పాటే పాజిటివ్లు పెరుగుతున్నాయి. మంగళవారం 18,858 పరీక్షలు చేయగా 1,764 మందికి వైరస్ నిర్థారణ అయింది. 788 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది. వైర్సతో మరో 12 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 492కు చేరింది. మరోసారి 33 జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 509, మేడ్చల్లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, కరీంనగర్లో 93, ఖమ్మంలో 69, సంగారెడ్డిలో 89, నల్లగొండలో 51 కేసులు వచ్చాయి. కాగా, 14 జిల్లాల్లో 30 పైగా కేసులు రావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 842 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 43,751 మంది కోలుకున్నారు. 14,663 యాక్టివ్ కేసులుండగా, 9,178 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. తాజా టెస్టులతో రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 3,97,939 అయింది.
నిజామాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులకు కరోనా ముప్పు తప్పడం లేదు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైరస్ బారినపడి కోలుకోగా, తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి పాజిటివ్గా తేలింది. ఆయన హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.
ప్రైవేటులోనే ఎక్కువ రోగులు
ఖమ్మం, జూలై 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా సోకిన ఖమ్మం ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు ఒకరు హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు రూ.10 లక్షలు వెచ్చించారు. కోలుకుని ఇం టికి చేరుకున్న తర్వాత ఆయన జరిపిన ఫోన్ సంభాషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, కొవిడ్ లక్షణాలతో ఖమ్మం జిల్లాలో నలుగురు మృతి చెందినా హెల్త్ బులెటిన్లలో చూపలేదు.
పది రోజుల్లో వివాహం.. కబళించిన కరోనా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వ్యాపారి(52) కరోనా లక్షణాలతో చనిపోయాడు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి ఉంది. జలుబు, జ్వ రంతో బాధపడుతున్న వ్యాపారిని 25న కరీంనగర్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్ష ఫలితాలు రాకముందే చనిపోయాడు.
30 గంటలు ఇంట్లోనే మృతదేహం
హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో జ్వరంతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం 30 గంటలు ఇంట్లోనే ఉండిపోయింది. స్థిరాస్తి వ్యాపారం చేస్తూ టీఆర్ఎ్సలో తిరిగే అతడికి 4 రోజులు క్రితం జ్వరం వచ్చింది. కరోనా పరీక్షలు చేయించుకోలేదు. ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నాడు. సోమవారం ఆ వ్యక్తి చనిపోగా భార్య స్థానిక నేతలకు సమాచారం ఇచ్చింది. కాగా, అంబులెన్స్తో వచ్చిన ప్రైవేట్ సిబ్బంది మృతదేహం ఉబ్బి ఉందని తిరిగి వెళ్లిపోయారు. ఇంట్లో భర్త మృతదేహంతో ఆమె 30 గంటల పాటు తీవ్ర వేదన అనుభవించింది. చివరకు కౌన్సిలర్ హైమాంజలి భర్త అనిల్కుమార్ చొరవతో.. మృతదేహానికి మంగళవారం రాయదుర్గంలోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు సదరు వ్యక్తి జ్వరం ఆపై ఆందోళనతో గుండెపోటుతో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అనిల్కుమార్తో పాటు చిత్రపురి వాసులు కారు ఏర్పాటు చేసి అతడి భార్య, కూతురును ఏపీలోని స్వస్థలానికి పంపించారు.