జీఓ 3ను రద్దు చేస్తూ ఈ నెల 22న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధం. విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగాలన్నింటినీ ఏజెన్సీ వాసులకే (స్థానిక గిరిజనులకే) ఇవ్వాలనేది ఈ జీఓ ఉద్దేశం. 2000 జనవరి 10న దీన్ని తెచ్చారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దీన్ని వర్తింపజేశారు. దీని ప్రకారం ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు చేసే వారికి స్థానిక భాష తెలియాలి. స్థానికంగానే ఉండాలి. ఈ జీఓ తేవడానికి ముందు బయటవారికి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల స్థానిక భాష తెలియకపోవడం, స్థానికంగా ఉండకపోవడం ప్రధాన సమస్యగా ఉండేది. పైగా ఎక్కువ మంది ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు విముఖత వ్యక్తం చేసేవారు. దీంతో చాలా పోస్టులు ఖాళీగా ఉండేవి. పైగా ఉద్యోగాల్లో చేరిన వారు కూడా సుదూర ప్రాంతాల నుంచి(మైదాన ప్రాంతం) వచ్చిపోయేవారు. స్థానికంగా ఉండకపోవడంతోనూ గిరిజనులకు సరైన సేవలు అందేవి కావు. పై అనేక ప్రత్యేక పరిస్థితుల్లో జీఓ 3 అమల్లోకి వచ్చింది.
ఈ జీఓ రావడానికి ముందు 1986 నవంబర్ 5న అప్పటి సోషల్వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.ఆర్.శంకరన్ కాలంలో జీఓ 275ను అమల్లోకి తెచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు ట్రిబ్యూనల్కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యూనల్ ఈ జీఓను కొట్టేసింది. సదరు జీఓ రద్దుద్వారా తమకు జరిగిన నష్టంపై గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జీఓను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. భవిష్యత్తులోనూ ఈ జీఓపై వివాదం చెలరేగే అవకాశమున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం దాని స్థానంలో జీఓ 3ను తీసుకొచ్చింది. దీని ప్రకారం కేవలం విద్యాశాఖలోనే ఉద్యోగాల భర్తీలో స్థానిక గిరిజనులకు 100శాతం రిజర్వేషన్లు వర్తిసాయి. కానీ తర్వాతి కాలంలో దీని పరిధిని మరింత విస్తరించారు. ఈ జీఓను మరిన్ని శాఖలకు వర్తింపజేస్తూ అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఓ మెమో ఇచ్చారు. అప్పటి నుంచీ ఈ జీఓ అమలవుతూ వస్తున్నది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లోనూ ఇవి వర్తిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గిరిజనులు రెంటికీ చెడ్డ రేవడవుతారు. విద్యాశాఖలోని 100శాతం రిజర్వేషన్లతో పాటు ఇతర శాఖల్లోని 6శాతం రిజర్వేషన్లనూ కోల్పోతారు. ఫలితంగా గిరిజనుల్లో నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత మరింత పెరుగు తుంది. పదోన్నతుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది.
లీలాప్రసాద్ అనే వ్యక్తి 2002లో సుప్రీంకోర్టుకు సివిల్ అప్పీల్కు వెళ్లాడు. ఈ జీఓ రద్దుపై ఆయన వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి. 1. 371(డి) ఆర్టికల్కు ఇది వ్యతిరేకమైంది. 2. జీఓ 66 ప్రకారం నిర్దేశించుకున్న జోనల్ వ్యవస్థ మార్గదర్శకాలకు ఇది భిన్నం. కానీ ఈ రెండు వాదనలూ తప్పు. 371(డి) ప్రకారం దేశంలోని అనేక రాష్ట్రాలకు అక్కడి భౌగోళిక పరిస్థితులు, సామాజిక, ఆర్థిక వెనకబాటు దృష్ట్యా ఆయా ప్రాంతాల గిరిజనులకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు రాజ్యాంగమే కల్పించింది. ఆ పూర్వరంగంలో వచ్చిందే ఈ జీఓ 3. వెనకబాటు, ముఖ్యంగా విద్యావకాశాలు దక్కడం లేదన్న కారణంతో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక సౌకర్యమిది. జోన్ విషయం చర్చించాల్సి వస్తే ఈ జీఓకూ జోన్కు సంబంధం లేదు. ఎందుకంటే జీఓ 3 అనేది ప్రత్యేకమైన స్థానిక రిజర్వేషన్. జోన్ అనేది కొన్ని జిల్లాలకు కలిపి వర్తించే రిజర్వేషన్. ఏ రీత్యా చూసినా లీలాప్రసాద్ కోర్టు ముందుంచినవి అసంబద్ధ వాదనలే. తాజాగా దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ జీఓ 3ని రద్దు చేస్తూ 152పేజీల తీర్పునిచ్చింది. ఇందులో అనేక వాదనలు జరిగాయి. జీఓను సమర్థిస్తూ రాజ్యాంగం ప్రకారం ఇది ఎలా కరెక్టో, ఏజెన్సీకి ఎందుకు అవసరమో కూడా వాదనలు ఉన్నాయి. అయినా వీటిని పక్కనబెట్టి జీఓను రద్దు చేస్తూ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ జీఓ రద్దు జరిగితే గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
గిరిజనుల వెనకబాటును దృష్టిలో పెట్టుకొని వీరి అభివృద్ధికి, సంస్కృతిని కాపాడటం కోసం, దోపిడీ, దాడులను అడ్డుకోవడం కోసం రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. ప్రత్యేక చట్టాలు తెచ్చింది. అందులో భాగంగా షెడ్యూల్ 5, 6 అర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపర్చింది. షెడ్యూల్ 6 ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు స్వయం పాలన కౌన్సిళ్లు ఏర్పాటు చేసింది. షెడ్యూల్ 5 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 50శాతానికి పైగా గిరిజన జనాబా కలిగిన ప్రాంతాలను, గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించారు. 1975లో ఐటీడీఏలు ఏర్పడ్డాయి. వీటి ఆధారంగానే నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నది. ఆయా చట్టాలను కూడా పాలకులు గిరిజనులపై ప్రేమతో తెచ్చినవి కావు.
కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాలు, కొమురం భీం, బీర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్ వంటి ఎందరో పోరాటయోధులు అమరులైన ఫలితంగానే ఇవి వచ్చాయి. ఆ క్రమంలో తీసుకొచ్చిన జీఓ 3 కూడా నేడు వేటుకు గురవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల సేవలో తరిస్తూ గిరిజనుల ప్రయోజనార్థం రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులను కాలరాస్తూ వస్తున్నాయి. ఏజెన్సీలో నిక్షిప్తమైన విలువైన ఖనిజ సంపదను వారికి కట్టబెట్టేందుకే ఈ పని చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం అందులో ముందున్నది. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు అందులో భాగమే. కాశ్మీరీయులకే సొంతమైన అక్కడి ఉద్యోగాలు, వనరులపై ఇప్పుడు కార్పొరేట్లకూ పెత్తనమొచ్చింది. 370 ఆర్టికల్కు అనుంబంధంగా ఉన్న 35ఎ రద్దు అందుకు అవకాశం కల్పించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోని జీఓలకూ, గిరిజనుల ప్రయోజనాలకూ దెబ్బపడుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలే నేడు నిజమయ్యాయి.
లంకా రాఘవులు
Courtesy: NT