– పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానానికి పడిపోయిన భారత్
– ఫేక్న్యూస్ ఎక్కువగా ప్రసారమవుతున్నారు : మీడియా వాచ్డాగ్
న్యూఢిల్లీ : పత్రికా స్వేచ్ఛలో భారత్ మరో రెండు స్థానాలు దిగజారింది. మొత్తం 180 దేశాలకు గానూ మీడియా వాచ్డాగ్ చేపట్టిన అధ్యయనంలో.. భారత్ 142వ (గతేడాది 140) స్థానానికి పడిపోయింది. గతేడాది మాదిరి ఈ నివేదికలో నార్వే ప్రథమస్థానంలో ఉండగా.. యూఎస్ 45వ స్థానంలో ఉంది. పలు యూరప్, ఆఫ్రికన్ దేశాలు భారత్ కంటే ముందున్నాయి. ఈ జాబితాలో ఉత్తరకొరియా చివరిస్థానంలో ఉంది.
భారత్లో నకిలీవార్తలు విస్తృతంగా ప్రసారం అవుతున్నాయని మీడియా వాచ్డాగ్ హెచ్చరించింది. కరోనా మహమ్మారి సందర్భంగా వీటి ఉధృతి మునుపెన్నడూ లేనంతగా పెరిగిందనీ, తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపింది. గతేడాది కాశ్మీర్లో సుదీర్ఘకాలం విధించిన కర్ఫ్యూను తీవ్రమైన సంక్షోభంగా అభివర్ణించింది. ప్రధాన మీడియా ప్రేక్షక పాత్ర పోషించిన వేళ.. స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేయడానికి కేంద్రం యత్నించిందని ఆరోపించింది.
భారత్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సోషల్మీడియాలో ‘ట్రోల్ ఆర్మీ’ల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే విషయాలను ప్రచారం చేశారని పేర్కొంది. యూఎస్లో పత్రికా స్వేచ్ఛ ‘సంతృప్తికరంగా’నే ఉన్నా.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జర్నలిస్టులతో వ్యవహరిస్తున్న తీరును మీడియా వాచ్డాగ్ ఎత్తిచూపింది. అక్కడ పాత్రికేయులపై పలు చోట్ల దాడులు జరుగుతున్నాయని వివరించింది. కరోనా సందర్భంగా పలు మీడియా సమావేశాల్లో ట్రంప్.. మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కిన విషయాన్ని తప్పుబట్టింది.
Courtesy: NT