సీతారాం ఏచూరి
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్నప్పటికీ 2025 నాటికి 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన దిశగా నడక బాగానే సాగుతున్నదని పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్టుగా కల్పిత కథనాలు ఇస్తున్నప్పటికీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడున్న వృద్ధిరేటు ప్రకారం చూస్తే భారత్ వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తోంది.
దేశ వృద్ధిరేటు ప్రస్తుతం 5శాతం లోపలే (4.9శాతం) ఉందని ఎన్సీఏఈఆర్ తెలిపింది. అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ ‘సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్’ అంచనాలను నివేదిస్తూ భారత్లో వృద్ధి సానుకూల దిశలో లేనేలేదని పీటీిఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇతర ప్రధాన రేటింగ్ సంస్థలు కూడా మన దేశ వృద్ధిరేటును 5శాతం లోపు గానే చెప్పాయి. ఐసీఆర్ఏ 4.7శాతం గాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.2శాతంగాను పేర్కొన్నాయి. వృద్ధిరేటు క్షీణత ప్రజల సంక్షేమం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచుతోంది.
పారిశ్రామిక రంగం
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 8 కీలక రంగాల వృద్ధిరేటు ఒక్క ఏడాదిలోనే 7.3శాతం నుంచి (2018 జులై) 2.1శాతానికి (2019 జులై) పడిపోయిందని వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రిత్వ శాఖ అంగీకరించింది. తయారీ రంగ వృద్ధి 6.9శాతం (2018 జూన్) నుంచి 1.2శాతానికి (2019 జూన్) క్షీణించింది. తత్ఫలితంగా పారిశ్రామిక రంగ వృద్ధిరేటు కూడా భారీగా పతనమైంది.
ఈ 19ఏండ్లలో ఎన్నడూ లేనంతగా వాహనరంగం వెనకబడిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 300 డీలర్షిప్పులు మూతబడ్డాయి. దాంతో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు పోయాయి. 2018 నుంచి వాహన కొనుగోళ్లు బాగా తగ్గిపోవడంతో వాహన రంగం 23.55శాతం క్షీణించింది. గ్రామీణ డిమాండ్కు కొలబద్దగా ఉండే ట్రాక్టర్ అమ్మకాలు ఏప్రిల్/జూన్లో 14.11శాతం పడిపోయాయి.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
గత కొన్నేండ్లుగా ఈ రంగంలో 35లక్షల మంది కార్మికులు పని కోల్పోయారు. వ్యాపారులు దారుణంగా దెబ్బ తిన్నారు. పెద్దనోట్ల రద్దు తాలూకు ప్రత్యక్ష ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయినవారిలో 43శాతం వీరే. లఘు పరిశ్రమలకు సంబంధించి 35శాతం, సూక్ష్మ సంస్థలలో 32శాతం, మధ్య తరహా సంస్థలలో 24శాతం ఉద్యోగాలు పోయాయి. చిన్న, మధ్య తరహా సంస్థలు తీసుకునే రుణాలు 50-80శాతం పడిపోయాయి. ఎంఎస్ఎంఈలకు, స్వయం సహాయక బృందాలకు, గ్రామ స్థాయి సంస్థలకు ఆర్థికంగా సహాయం చేసేందుకే ముద్రా రుణ పథకమని మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. 2018-19లో ఈ పథకం కింద 126శాతం నిరర్థక ఆస్తులు పోగయ్యాయి. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈఎస్ రంగం ఈ విధంగా చితికిపోయింది.
తగ్గిన డిమాండ్
భారతీయులలో అత్యధిక జనబాహుళ్యం కొనుగోలు శక్తి ఘోరంగా పడిపోవడమే ఆర్థిక మాంద్యానికి మూల కారణం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఇటీవలి కొన్నేండ్లలో నిరుద్యోగం బాగా పెరిగింది. వ్యక్తిగత వినిమయ వ్యయం దేశ జీడీపీకి వెన్నెముక లాంటిది. దీనివల్ల జీడీపీలో 57శాతం ఒనగూరుతుంది. అటువంటి వినిమయ వ్యయం (మార్చి 2019 త్రైమాసికం) 7.2శాతం నుంచి 3.1శాతానికి (జూన్ 2019 త్రైమాసికం) తగ్గింది. ఆర్థిక క్షీణతకు ఇదే ప్రధానమైన కారణం. ప్రధాన వినిమయ వస్తువులు (ఎఫ్ఎంసీజీ)తో సహా అన్ని రంగాలలోను అమ్మకాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. గతేడాది కాలంలో హిందూస్థాన్ లివర్ అమ్మకాలు 12 నుంచి 5శాతానికి, బ్రిటానియా అమ్మకాలు 13 నుంచి 6, డాబర్ ఇండియా అమ్మకాలు 21 నుంచి 6శాతానికి క్షీణించాయి. చారు బిస్కట్ దేశంలో ఆఖరికి రూ.5 బిస్కెట్ ప్యాకెట్లు కూడా అమ్ముడుపోని అధ్వాన్న స్థితి దాపురించింది.
తీవ్రమైన నిరుద్యోగం
గత అర్ధ శతాబ్దిలో ఎన్నడూ లేనరత ఎక్కువగా నిరుద్యోగరేటు నమోదైంది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2018లోనే 1.1కోట్ల ఉద్యోగాలు పోయాయి. పెద్దనోట్ల రద్దు కారణంగానే 35లక్షల ఉద్యోగాలు పోయాయని అంచనా (సీఎంఐఈ గణాంకాలు). ప్రతీ ఏడాది 50లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగార్థులుగా శ్రామిక మార్కెట్లో చేరుతున్నారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల భాగస్వామ్యం 43శాతం నుంచి (2004-2005) 36.9శాతానికి (2017-2018) పడిపోయింది. ఈ కాలంలో మహిళా కార్మికుల వాటా 29.4 నుంచి 17.5శాతానికి క్షీణించింది.
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల కల్పనతో అచ్చేదిన్ (మంచి రోజులు) తీసుకొస్తానన్నది మోడీ వాగ్దానం. అయితే జరిగింది వేరు. 15 నుంచి 29ఏండ్ల నిరుద్యోగ యువత 2004-05లో ఏడు కోట్లు ఉంటే, 2017-18 నాటికి వారి సంఖ్య 11.56 కోట్లకు పెరిగింది. 2011-12 నుంచి 2015-16 నాటికి ఉద్యోగ కల్పన 106లక్షల (589 లక్షల నుంచి 483లక్షలకు) మేర పడిపోయింది.
పడిపోతున్న నిజవేతనాలు
పట్టణ కార్మికుల నిజ వేతనం (2012-18) రూ.226 నుంచి రూ.205 పడిపోయింది. 8.9శాతం క్షీణత ఇది. ఉపాధి హామీ పథకం పుణ్యాన గ్రామీణ దినసరి కార్మికుల వేతనం 2012 ముందు 44.5శాతం పెరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఈ పథకానికి తిలోదకాలిచ్చిన కారణంగా 2012-18 కాలంలో ఇదే వేతనం కనాకష్టంగా 6శాతం మాత్రమే పెరిగింది.
వృద్ధి లేని వ్యవసాయం
వ్యవసాయరంగ దుస్థితి మరింతగా తీవ్రమవుతోంది. వ్యవసాయ వృద్ధిరేటు సగటు 3.37 నుంచి (2004-14) 2.7శాతానికి (2014-19) పడిపోయింది. వాస్తవానికి గ్రామీణ వేతన పెరుగుదల రేటు (2017 జనవరి) 6.5శాతం నుంచి 3.9 (2018 జనవరి)కి తగ్గింది. ఈఏడాది అది మరింతగా క్షీణించింది.
12.5 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూర్చేందుకంటూ మోడీ ‘పీఎం కిసాన్ పథకం’ ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఉపయోగించుకొని బీజేపీ, మోడీ ఎన్నికలలో బాగానే ప్రయోజనం పొందారు. ఊహించినట్టే ఎన్నికల అనంతరం ఆ పథకాన్ని పక్కన పెట్టేశారు. 2019 జులై 15 నాటికి కేవలం 3.97కోట్ల మంది (అర్హులలో 32శాతం) మాత్రమే తొలి విడత కిస్తీ అందుకున్నారు. ఆ తరువాత రెండవ కిస్తీ కూడా కేవలం 3.5కోట్ల మందికి మాత్రమే అందింది.
క్షీణించిన ప్రభుత్వ వసూళ్లు
ఈ ప్రభుత్వ హయాంలో పన్ను వసూళ్లు బాగా పడిపోయాయి. పరోక్ష పన్నుల ఆదాయం 21.33 (2016-17) నుంచి (2017-18) 5.8శాతానికి మందగించింది. సేవారంగం నుంచి కూడా వేసిన అంచనా కంటే తక్కువగానే 10శాతం మాత్రమే సమకూర్చి పెట్టింది. ప్రధానంగా ఐటీరంగం కుదించుకుపోవడం ఇందుకు కారణమైంది. ప్రభుత్వం 2019-20 నాటికి రూ.13.35 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. అయితే తొలి ఆరు మాసాలలో రూ.5.5 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే.. తదుపరి ఆరు నెలల్లో రూ.7.8 లక్షల కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది! ఇక జీఎస్టి వసూళ్లు 20శాతం పడిపోయాయి.
బ్యాంకింగ్ సంక్షోభం
బ్యాంకుల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు-ఎన్పీఏ) 3.8శాతం (2014) నుంచి 9.3శాతానికి (2018) పెరిగాయి. నిరర్థక ఆస్తుల రద్దు 2014 ముందుతో పోలిస్తే 8 రెట్లు పెరిగింది. అయితే రద్దు చేసిన ఈ బాకీల ఎగవేతదార్ల, మోసగాళ్ల పేర్లను మాత్రం బయిట పెట్టలేదు. అటువంటి మోసగాళ్లను మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాపాడుతోందన్న మాట.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం
ఎన్పీఏ రద్దు ద్వారా అస్మదీయ కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదార్లకు లాభించేలా పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ మొదలెట్టింది.
ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణ
రైల్వే, ఎయిర్ ఇండియా, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ సంస్థలు సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించ పూనుకుంది. దీనివల్ల ఉద్యోగాల నుంచి తొలగించే రిట్రించిమెంట్ భారీగా సాగుతుంది. నిరుద్యోగం దారుణంగా పెరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఈ తతంగం భారత ఆర్థిక సార్వభౌమత్వానికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని బలహీన పరుస్తుంది. అది దేశానికి, దేశ ప్రజల సంక్షేమానికీ కూడా నష్టదాయకం.
ప్రజల సొమ్ము మళ్లింపు
పన్ను వసూళ్లలో తగ్గుదల ఒకవైపు వుండగా.. మరో వైపు ఎన్పీఏల ద్వారా ఆర్థిక వ్యవస్థ లూటీ కారణంగా మున్నెన్నడూ లేని విధంగా బ్యాంకింగ్రంగం సంక్షోభంలో పడిపోయింది. ఈ గండిని భర్తీ చేసుకోవడం కోసం రూ.1.76లక్షల కోట్లను ఆర్బీఐ నుంచి మిగులు నిధులను మోడీ ప్రభుత్వం లాగేసుకుంది. అంతేగాక ప్రభుత్వరంగ బ్యాంకుల బెయిలవుట్ల కోసం, ప్రభుత్వ ఆదాయం కొరతను తీర్చుకోవడం కోసం ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ప్రజల సొమ్మును, ప్రజల జీవిత కాల పొదుపు నిధులను దారి మళ్లించాలని ఒత్తిడి పెట్టింది. అప్పుల్లో మునిగిపోయిన ‘ఐడీబీఐ ఇండిస్టియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బెయిలవుట్ కోసం రూ.21,000కోట్ల పెట్టుబడి పెట్టమని ఎల్ఐసీని నిర్బంధించింది. లక్షలాది మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పింఛను, ఇన్సూరెన్సు పథకాల నిధులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈపీఎఫ్ దగ్గర సుమారు రూ.10లక్షల కోట్ల కార్పస్ నిధి ఉంది. ప్రభుత్వం ఈ డబ్బును కూడా వాడుకోవడం మొదలెడితే దేశంలో కోట్లాది మంది ఉద్యోగుల భద్రతకు మునుపెన్నడూ లేనంత ముప్పు వాటిల్లుతుంది.
(Courtesy: NT)