– పాక్, బంగ్లాల్లో ముస్లిమేతరుల శాతం క్షీణత అవాస్తవం
– ‘ఇండియా టుడే’ నివేదికలో తేటతెల్లం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చిస్తున్న ఒకే ఒక్క అంశం వివక్షపూరితమైన పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ). ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మోడీ, అమిత్షాల ద్వయం పక్కాప్రణాళికతో ఈ బిల్లును తీసుకువచ్చారని నిరసనలు వెల్లువెత్తుతున్నా… ఈశాన్యరాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటున్నా… పలువురి ప్రాణాలు పోలీసుల తూటాలకు బలౌతున్నా.. మేం చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న చందాన ‘క్యాబ్’ను చట్టంగా రూపొందించారు. ఈ బిల్లును ఆమోదింపజేసు కోవడానికి అమిత్షా అల్లిన ‘కహానీ’… పొరుగు దేశాలు ముస్లింమేతరులను రాచిరంపాన పెడుతున్నాయని. వివరాల్లోకి వెళితే ఇవన్నీ అవాస్తవాలే అని తేలుతున్నాయి.
అమిత్ షా చెప్పిన కథ
గత సోమవారం క్యాబ్ను లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్షా మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి పాకిస్తాన్లో ముస్లిమేతరులు ఆ దేశ జనాభాలో 23 శాతం ఉండగా… 2011 నాటికి వారి జనాభా 3.7 శాతానికి తగ్గిందని అన్నారు. బంగ్లాదేశ్లో 22 శాతం ఉండగా… 2011 నాటికి వారు 7.8 శాతానికి పడిపోయారని చెప్పారు. లోక్సభలో ఈ బిల్లును ఆమోదింపజేసుకుని రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయం లోనూ దీన్నే వల్లెవేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనార్టీలు (అక్కడ హిందువులు) ఏమైపోయారు..? అక్కడ వారు హింసకు గురి అవుతున్నారు? అందుకే భారత్కు పరుగు పెడుతున్నారు అంటూ షా పేర్కొన్నారు. ఇలా అనడం వెనుక ప్రధానఉద్దేశం, బీజేపీ తన హిందూత్వ భావజాలంతో మద్దతుదారులను కూడబెట్టుకునేందుకేనన్నది విస్పష్టం. 1947 దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో మైనార్టీలు పీడనకు గురి అవుతున్నారని వాదించేందుకే. అయితే అమిత్షా వ్యాఖ్యల ఆధారంగా ఇండియా టుడే చేపట్టిన సర్వేచూస్తే ఇవి తప్పుడు వాదనలని తేటతెల్లమైంది.
పాకిస్తాన్లో ముస్లిమేతరుల గణాంకాలు పరిశీలిస్తే..
1947, ఆగస్టు 14న మత ప్రాతిపదికన పాకిస్తాన్ విభజన జరిగింది. అందులో భాగంగా బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా అవతరించింది. అయితే అప్పటి జనాభాపై సరైన ప్రామాణికత లేనప్పటికీ.. కేంద్ర హోంమంత్రి చెప్పిన గణాంకాలు ఎక్కడివో తెలియదు. అయితే అటువంటి గణాంకాలనే 2013లో హడ్సన్ ఇనిస్టిట్యూట్ ప్రచురించింది. బహుశా ఆయన దానినే ఫాలో అయినట్టు తెలుస్తున్నది. విభజన అనంతరం 1951లో తొలిసారి జనగణన జరిగింది. తూర్పు, పశ్చిమ పాక్లలో ఈ గణాంకాలను చేపట్టారు. అప్పట్లో పాకిస్తాన్ జనాభాలో ముస్లింలు 85.80 శాతం ఉండగా, ముస్లిమేతరులు 14.20 శాతం. అయితే పశ్చిమ పాక్లో ముస్లిమేతరుల జనాభా 3.44 శాతం, తూర్పు పాక్లో (బంగ్లాదేశ్) 23.20 శాతంగా ఉంది. ప్రసుతం షా చెబుతున్న లెక్కలను పరిశీలించాలంటే తూర్పు, పశ్చిమ పాక్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి.
పశ్చిమ పాకిస్తాన్లో పరిస్థితులు
1951లో అప్పటి పాకిస్తాన్లో ఐదు ప్రావిన్సులున్నాయి. వాటి మొత్తం ముస్లింల సగటు జనాభా 96.56 శాతంగా ఉంది. ఈ పట్టికను పరిశీలిస్తే వాస్తవాలు తెలుసుకోవచ్చు.
ప్రాంతం ముస్లిం జనాభా శాతం
పాకిస్తాన్ మొత్తం 85.8
బెలూచిస్తాన్ 98.5
తూర్పు బెంగాల్ 76.8
ఫెడరల్ కాపిటర్ ఏరియా కరాచీ 96.0
ఎన్డబ్ల్యుఎఫ్పీ 99.9
పంజాబ్ 97.9
సింధ్ 90.5
తదుపరి జన గణన 1961లో జరగ్గా… పశ్చిమ పాకిస్తాన్లో ముస్లిమేతర జనాభాలో 2.83 శాతానికి పడిపోయింది. మూడవ జనగణన చేపట్టేనాటికి తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్గా మారిపోయింది. 1972 నాటి జనగణన ప్రకారం ఆ దేశ జనాభాలో ముస్లిమేతరులు 3.25 శాతం ఉన్నారు. ఈ లెక్కలను ఓసారి చూస్తే… 1961 గణాంకాల కన్నా ఎక్కువే. 1981 నాటికి ఆ సంఖ్య (3.30 శాతం) స్వల్పంగా పెరిగింది. ప్రస్తుత పాకిస్తాన్లో ముస్లిమేతరుల వాటా 3.50 శాతం పెరిగితే… బీజేపీ మాత్రం క్షీణించిందని చెప్పుకోవడం గమనార్హం. 1981 తర్వాత మళ్లీ 15 ఏండ్లకు పైబడి అనగా 1998లో జనగణన చేపట్టింది. ఆ సమయంలో ఆ దేశంలో మైనార్టీల శాతం 3.70గా నమోదైంది. 2017లో తాజా జనగణన నిర్వహించినప్పటికీ సరైన సమాచారం లేదు.
తప్పిన అమిత్షా లెక్క
1. పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీలు 23 శాతం లేరని తేటతెల్లమైంది.
2. అవిభక్త పాకిస్తాన్లో ఆ సంఖ్య శాతం 15 శాతాన్ని కూడా దాటలేదు. (1951లో అత్యధికంగా 14.2 శాతం )
3. నేటి పాకిస్తాన్ (అప్పటి పశ్చిమ పాకిస్తాన్)లో 1951 నాటికి ముస్లిమేతరులు 3.44 శాతమే.
4. పాకిస్తాన్లో దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే మైనార్టీల శాతం కేవలం 3.5 శాతం మాత్రమే పెరిగింది.
బంగ్లాదేశ్ను పరిశీలిస్తే
అప్పటివరకు తూర్పు పాకిస్తాన్గా చెలామణి అవుతున్న బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్య్రం వచ్చింది. 1951లో ఉమ్మడి పాక్లో జనగణన సమయంలో.. తూర్పు పాక్లో మాత్రమే 23.20 శాతం ముస్లిమేతరులు ఉన్నట్టు గణాంకాలు వెలువడ్డాయి. 1961 నాటికి 19.57 శాతానికి, విభజన అనంతరం 1974 చేపట్టిన జనగణనలో14.60 శాతం, 1981లో 13.40 శాతం, 1991 నాటికి 11.70 శాతం, 2001 నాటికి 10.4 శాతం మైనార్టీలు ఉన్నట్టు వెల్లడయ్యాయి. 2011నాటికి ఆ సంఖ్య 9. 6 శాతానికి పడిపోయింది. 1951 నుంచి 2011 వరకు ఈ గణాంకాలను పరిశీలిస్తే ముస్లింల శాతం పెరిగింది. ఈ సమయంలో హిందువులు 22 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గారు. ముస్లిమేతరుల వాటా 9.60 శాతంగా ఉంది.
అసంబద్ధమైన బీజేపీ వాదనలు
1947లో విభజన అనంతరం సరైన జనాభా ప్రామాణికత లేనందున… 1951 ప్రాతిపదికను పరిశీలిస్తే..
బీజేపీ పేర్కొంటున్న ప్రకారం పాకిస్తాన్లో 1951లో 23 శాతం ముస్లిమేతరులు ఉండగా.. 2011 నాటికి ఆ సంఖ్య 3.7 శాతానికి క్షీణించింది. 23 శాతం కేవలం తూర్పు పాకిస్తాన్ గణాంకాలను సూచిస్తోంది తప్ప… మొత్తం పాకిస్తాన్ గణాంకాలు కావని తేలిపోయింది. రెండవది పరిశీలిస్తే ముస్లిమేతర జనాభా 3.7 శాతం క్షీణించలేదని తెలుస్తున్నది. అంటే బీజేపీ వాటి హిందూ సిద్ధాంతాన్ని బలపర్చేందుకు తప్పుడు గణాంకాలు తెరపైకి తీసుకువచ్చిందని స్పష్టమౌతున్నది.
ఇక మూడవ అంశానికి వస్తే బంగ్లాదేశ్లో ముస్లిమేతరులు 22 శాతం ఉండగా.. 2011 నాటికి 7.8శాతానికి చేరుకుందని.. ఇందులో కొంత వాస్తవమున్నా.. అవి పేర్కొన్న లెక్కలు అచ్చుతప్పులు. 1951లో 23.20 శాతం ఉండగా.. 2011 నాటికి 9.40 శాతానికి చేరుకుంది. నాల్గొవ అంశం మతపరమైన పీడన వల్లే ముస్లిమేతరుల శాతం తగ్గిందని బీజేపీ వాదిస్తున్నది. అయితే మతపరమైన మార్పిడి ఒత్తిళ్ల కారణంగానే వారు ఇటుగా వస్తున్నారనీ, అంతేకాకుండా భారత్లో జీవనోపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం కూడా ముస్లిమేతరులు భారత్కు వలస వచ్చే పరిస్థితులకు దారితీశాయని తేలింది. అలా వలస వచ్చిన వారిలో కేవలం ముస్లిమేతరులే కాకుండా, ముస్లింలూ ఉన్నారని నివేదికలో వెల్లడైంది. అంటే ప్రభుత్వం పేర్కొంటున్న మత పీడన ఒక్కటే కారణమనేది పూర్తిగా అసంబద్ధమని స్పష్టమౌతున్నది.
Courtesy Nava telangana