మరో 10,080 కొత్త కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా..మరణాల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఒకేరోజు మరో 97 మందిని బలి తీసుకుంది. ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,17,040కు చేరింది. 24 గంటల్లో మొత్తం 24,24,393 వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేశారు. గుంటూరు జిల్లాలో 14 మంది, అనంతపురం జిల్లాలో 11 మంది, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,939కు చేరింది. గత 24 గంటల్లో 9,151 మంది కోలుకుని డిశ్ఛార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,29,615 మంది (59.72%) కోలుకున్నారు. 85,486 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులతో పోలిస్తే మరణాలు 0.89 శాతం మేర నమోదయ్యాయని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.
ఎంసీఐ నిబంధనల ప్రకారం రుసుములు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులంతా భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల మేరకు కరోనా రోగుల నుంచి రుసుములు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ బి.సాంబశివరెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రతి వైద్యుడు తాను తీసుకుంటున్న రుసుములు, ఇతర ఛార్జీలను ఛాంబర్ వెలుపల నోటీసు బోర్డులో ఉంచాలని, అర్థమయ్యే రీతిలో మందుల జాబితా రాయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వైద్యులపై బాధితులు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో అంతస్తులోని ఏపీ వైద్య మండలిలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
- తెలంగాణలో శనివారం కొత్తగా 2,256 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 77,513కు పెరిగింది. మొత్తం 615 మంది మరణించారు. తమిళనాడులో శనివారం కొత్తగా 5,883 మందికి వ్యాధి సోకగా 118 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో శనివారం 7,178 కరోనా కేసులు రాగా 93 మంది మృతిచెందారు.
అన్నవరంలో కలకలం
అన్నవరం, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 49 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. శనివారం 300 మందికి పరీక్షలు చేయించగా 39 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఈనెల 14 వరకు స్వామి దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Courtesy Eenadu