ప్రపంచ వ్యాప్తంగా 3500 పైగా మరణాలు.. 92 దేశాలకు విస్తరణ
కరోనావైరస్ కాలమేఘంలా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య లక్ష దాటింది. 92 దేశాలకు విస్తరించింది. ఇప్పటిదాకా- 1,00, 842 మందికి ఇది సోకినట్లు ఏఎ్ఫపీ వార్తాసంస్థ ప్రకటించింది. మొత్తం చైనా అంతటా 80వేల పైచిలుకు కేసులు కాగా, మిగిలిన 21వేల కేసులు ఇతర దేశాలవి. వ్యాధి సోకిన వారిలో 54,600 మందికి నయమై డిశ్ఛార్జి అయినట్లు కూడా ఏఎ్ఫపీ సంస్థ వెల్లడించింది.
వాషింగ్టన్: వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. మరణాల సంఖ్య 14కు పెరిగింది. ఒక్కరు తప్ప అంతా వాషింగ్టన్ డిస్ట్రిక్ట్లోనే! 227 మందికి పైగా మందికి సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పటికే వాషింగ్టన్, కాలిఫోర్నియా, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో వైద్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 19 రాష్ట్రాల్లో స్వచ్ఛంద ఏకాంతవాస ఉత్తర్వులు వెలువడ్డాయి. కాలిఫోర్నియా తీరంలో గ్రాండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న వారిలో ఎంతమందికి ఇది సోకిందన్నది ఇంకా తేలాల్సి ఉండడంతో ఎవ్వరినీ బయటకు రానివ్వలేదు. చైనాలో మూడ్రోజుల్లో మొత్తం 30 మరణాలు సంభవించగా- 143 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య (3042) మొత్తం మీద తగ్గినప్పటికీ ఓ కొత్త సమస్య ఆ దేశాన్ని చుట్టుముట్టింది. ఇన్నాళ్లూ చైనా నుంచి వచ్చినవారి వల్ల ఈ వైరస్ సమస్య రాగా, ఇపుడు చైనా… ఇతర దేశాల నుంచి వచ్చినవారి వల్ల సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయ్, సింగపూర్ మొదలైన దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా పరీక్షలు జరుపుతున్నారు. వుహాన్ నగరంలో వైరస్ వచ్చి నయమైపోయిందనుకున్న లీ లియాంగ్ (36) అనే వ్యక్తి ఆకస్మికంగా మళ్లీ ఇదే వైరస్ ఎటాక్ చేసి చనిపోయాడు.
ఇరాన్ అంతటా..!
ఇరాన్లో మరణాల సంఖ్య 125 దాటింది. వీరిలో విదేశాంగమంత్రి సలహాదారు కూడా ఉన్నారు. మరో 4800 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రయాణ ఆంక్షలను పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తే విచారణ లేకుండా ఖైదు చేస్తామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
భారత్కు జపాన్ హెచ్చరిక
వైరస్ వల్ల జపాన్- భారత్ మధ్య, జపాన్- దక్షిణ కొరియా మధ్య దౌత్య యుద్ధానికి తెరలేచింది. ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీలతో సమానంగా జపాన్ నుంచి వచ్చేవారికి కూడా వీసాలు జారీచేయరాదని భారత్ తీసుకున్న నిర్ణయంపై జపాన్ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఇది రెండు దేశాల ఆర్థిక సంబంధాలపై గట్టి ప్రభావం చూపుతుందని భారత్కు హెచ్చరిక చేసింది.
ఇటలీ…క్షణ క్షణం… భయం భయం..
ఐరోపా సమాజంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇటలీలో పరిస్థితి గడ్డుగా ఉంది. 200 మందికి పైగా మరణించి- యూర్పలో కరోనా కేంద్రస్థానంగా మారింది. ఇక్కడ- మరో 3800 మంది వైరస్ సోకి పోరాడుతున్నారు. ఇటలీ పక్కనే ఉన్న వాటికన్లో సైతం ఒక వ్యక్తికి కరోనా సోకింది. దీంతో- మతాధికారులు ఉపయోగించే క్లినిక్లో అత్యవసర జాగ్రత్త చర్యలు చేపట్టారు. బెత్లెహాంలో ఏడుగురు పాలస్తీనియన్లకు కరోనా సోకడంతో నేటివిటీ చర్చ్ను నిరవధికంగా బంద్ చేశారు. బ్రిటన్లో ఇద్దరు మరణించారు. మరో 163 మందికి సోకినట్లు తేలింది.
నిర్మానుష్య కాబా
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిత్యం వేలాది మంది ముస్లింలు సందర్శించే మక్కాలోని కాబా. విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఉమ్రా యాత్రను సౌదీ అరేబియా నిలిపివేయడంతో ఇలా నిర్మానుష్యంగా మారింది.
Courtesy Andhrajyothi