- కొవిడ్ చిక్సిత అందించే 32 ఆస్పత్రుల్లోనూ..
- రాష్ట్రంలో ఉన్నవి 800 మాత్రమే
- కేంద్రం ఇచ్చింది 1400 వెంటిలేటర్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందించే సర్కారీ దవాఖానాల్లో వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లా ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటరూ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రుల్లో 800 వెంటిలేటర్లే ఉన్నాయి. వాటితో ప్రస్తుతం 467 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఉన్న వెంటిలేటర్లలో మెజారిటీ గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నాయి. అక్కడ 385 వెంటిలేటర్లు ఉండగా.. ప్రస్తుతం 361 మందికి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ చికిత్స అందించే 32 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికీ ఒక్క వెంటిలేటర్ను కూడా ఏర్పాటు చేయలేదు.
కొవిడ్ చిక్సిత అందిస్తున్న జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటైన జిల్లా ఆస్పత్రులతో పాటు ఉమ్మడి జిల్లా ఆస్పత్రులు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, నర్సంపేట, భువనగిరి జిల్లా ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటర్ కూడా లేదు.
ఎక్కువగా గాంధీకే
జిల్లాల్లో సీరియస్ అయిన కరోనా కేసుల్ని ఎక్కువగా గాంధీ ఆస్పత్రికే పంపుతున్నారు. ప్రస్తుతం సర్కారీ దవాఖానాల్లో మొత్తం 467 మంది వెంటిలేటర్లపై ఉంటే అందులో ఒక్క గ్రేటర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 392 మంది చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 75 మంది జిల్లాల్లో కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఉన్న 800 వెంటిలేటర్లలో 482 హైదరాబాద్ సర్కారీ దవాఖానల్లోనే ఉన్నాయి. అవి పోగా రాష్ట్రమంతా 312 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతోనే గాంధీ ఆస్పత్రికి రోగుల్ని పంపాల్సి వస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 1400 వెంటిలేటర్లను పంపింది. వాటిని జిల్లా, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా ప్రయత్నించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేకపోవడంతో అక్కడి కరోనా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,077 వెంటిలేటర్ పడకలుంటే, అందులో 357 మంది చికిత్స పొందుతున్నారు.
ఏరియా, సీహెచ్సీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్స్ నిల్
భద్రాచలం, ఇల్లెందు, పటాన్చెరు, ఫీవర్ ఆస్పత్రి, చిట్యాల, దోమకొండ, జమ్మికుంట, తూఫ్రాన్, ఘట్కేసర్, నాగర్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, భైంసా, ఆర్మూర్, బోధన్, గోదావరిఖని, వనస్థలిపురం, జోగిపేట, నారాయణ్ఖేడ్, హుజుర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. జిల్లాల్లో ప్రస్తుతం పెద్దయెత్తున కరోనా కేసులు వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఎటువంటి చికిత్స అందిస్తున్నామో, జిల్లాల్లో కూడా అలాగే చికిత్స చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ గొప్పలు చెప్పుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయన్నది గణాంకాల ద్వారా తేటతెల్లమవుతోంది.
Courtesy Andhrajyothi