- శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల
- విద్యుదుత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రిభారీ అగ్ని ప్రమాదం
- 900 మెగావాట్ల సామర్థ్యం గలహైడల్ ప్రాజెక్టు పూర్తిగా దగ్ధం
- రోజంతా సహాయక చర్యలు
- కొనసాగినా దక్కని ప్రాణాలు
- మృతుల్లో ఇద్దరు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు
- పొగ వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన వైనం
- ఐదుగురు ఇంజనీర్లు సహా 9మంది దుర్మరణం
- మృతుల్లో డీఈ ప్రాణాలు కాపాడుకున్న 10 మంది
నాగర్కర్నూల్/అచ్చంపేట/దోమలపెంట : పండగ ముందు పెనువిషాదం! తొమ్మిది కుటుంబాల్లో తీరని శోకం!! షార్ట్ సర్క్యూట్ కారణంగా శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ఇంజనీర్లు సహా తొమ్మిది మంది దుర్మరణంపాలయ్యారు! దట్టంగా కమ్మేసిన పొగలో దారి కనిపించక.. ఎటెళ్లాలో తెలియక.. పొగ వల్ల ఊపిరి ఆడక, ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపలే ఉన్న మరో పది మంది అత్యవసర ద్వారం గుండా ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించి… చికిత్స అందిస్తున్నారు. 900 మెగావాట్ల సామర్థ్యం గల హైడల్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎంత మేర నష్టం జరిగిందని యంత్రాంగం అంచనా వేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10.35 గంటల సమయంలో మూడో యూనిట్ వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
అక్కడ పనిచేసే జెన్కో సిబ్బంది.. అక్కడే ఉన్న మినీ ఆక్సిజన్ సిలిండర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. చూస్తూచూస్తుండగానే.. క్షణాల్లో మంటలు మిగతా ఐదు యూనిట్లకూ వ్యాపించాయి! ఒక్కో విభాగంలో కంట్రోల్ యూనిట్లు పేలిపోతూ.. మంటలు ఎగసిపడ్డాయి!! అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో దిగువన ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. విపరీతమైన వేడి, దట్టంగా అలముకున్న పొగ కారణంగా.. 20 అడుగులకు మించి లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పవర్హౌజ్ జీరో బేస్ నుంచి సర్వీస్ బే వరకూ.. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న సొరంగం పూర్తిగా పొగతో నిండిపోవడంతో మంటలార్పే ప్రయత్నం ముందుకు సాగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల చిక్కుకుపోయిన ఏఈ మోహన్కుమార్ సమీపంలో ఉన్న జెన్కో కాలనీకి చెందిన ఫోర్మెన్ అశోక్కుమార్కు ఫోన్ చేసి.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్యానల్ బోర్డులు కాలిపోయాయని, తామంతా ప్రమాదంలో ఉన్నామని తెలిపారు. వెంటనే ఆయన మెయిన్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో రాత్రి 11 గంటల సమయంలో అగ్నిప్రమాదం విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. మెయిన్ కంట్రోల్ రూమ్ నుంచి జెన్కో ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో వారు అప్రమత్తమయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా నుంచి, అటు శ్రీశైలం నుంచి.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలార్పే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సింగరేణి రెస్క్యూ టీమ్ కూడా సహాయకచర్యల్లో పాల్గొంది.
పొగలో తారాడుతూ బయటకు..
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పవర్హౌజ్లోని ఆరు యూనిట్లలో మొత్తం 17 మంది జెన్కో ఉద్యోగులు విధుల్లో ఉండగా, బ్యాటరీల సర్వీసింగ్ నిమిత్తం వచ్చిన ఎమరాన్ కంపెనీకి చెందిన ఇద్దరు టెక్నీషియన్లున్నారు. మంటల్లో చిక్కుకున్న ఈ 19 మందిలో.. పది మంది ఎస్కేప్ వే ద్వారా పొగలోనే తారాడుకుంటూ ఎలాగోలా బయటపడ్డారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో ఫైరింజనే లోపలకు వెళ్లే అవకాశం ఉండడంతో రాత్రంతా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ, దట్టంగా అలుముకున్న పొగ పవర్ హౌజ్ని, లోపలకు వెళ్లే మార్గాలన్నింటినీ కమ్మేయడంతో సహాయకచర్యలు మందుకు సాగలేదు. సహాయక బృందాలు ఎంతగా ప్రయత్నించినా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ పవర్ హౌజ్ లోపలికి ప్రవేశించలేకపోయారు. రాత్రి రెండు గంటలకు పవర్హౌజ్ ప్రాంతానికి చేరుకున్న మంత్రి జగదీ్షరెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, విప్ గువ్వలబాలరాజు, డైరెక్టర్ వెంకటరాజం, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎస్పీ డాక్టర్ సాయిశేఖర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. ఎన్డీఆర్ఎ్ఫ, సీఐఎస్ఎఫ్ బృందాలు మధ్యాహ్నం మూడుగంటలకు ఘటనా స్థలికి చేరుకొని పొగను బయటకు పంపే చర్యలు చేపట్టాయి. ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన ఈ బృందంలోని సభ్యులు.. ఒక్కో దశ నూ దాటుకుంటూ అతి కష్టమ్మీద పవర్హౌజ్లోకి వెళ్లి.. పొగ బయటకు వెళ్లేందుకు వీలుగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను నడిపించారు. దీంతో నాలుగు గంటల్లోగా పొగ తొలగింది. అనంతరం ఒక్కో యూనిట్లోకీ వారు ప్రవేశించి.. మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తెచ్చారు. సాయంత్రం ఐదున్నరలోగా మొత్తం తొమ్మిది మృతదేహాలను బయటకు తెచ్చారు.
బయటకు వచ్చినవారు..
ఆరో యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు మిగతా యూనిట్లకూ వ్యాపించడంతో లోపల ఉన్న సిబ్బంది ఎస్కేప్ వే గుండా బయటకు రావడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో.. డీఈ పవన్కుమార్, ఏడీఈ అంకినీడు, ఆర్టిజాన్ కృష్ణారెడ్డి, రవి, జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్లు వెంకటయ్య, మతృ మోతీలాల్, రామకృష్ణ, డ్రైవర్ పాల్ వెంకయ్య, ప్లాంట్ అటెండెంట్లు మోజెస్, జయబాబు సఫలమై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బయటకు వచ్చే క్రమంలో డీఈ పవన్కుమార్ ఊపిరి ఆడక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే.. అప్పటికే బయటకు వెళ్లిపోయిన ఆయన డ్రైవర్ పాల్వెంకయ్య.. ‘మా సార్ లోపలే ఉండిపోయారు, ఎలాగైనా బయటకు తేవాలి’ అనుకుని అత్యవసర వాహనాన్ని తీసుకుని మళ్లీ లోపలికి వెళ్లి ఆయన్ను కాపాడి బయటకు తెచ్చారు. పవర్హౌజ్ అంతా పొగ వ్యాపించడంతో ఇతర యూనిట్లలో ఉన్న ఉద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయిందని వెంకయ్య తెలిపారు.
మృతుల వివరాలు
- శ్రీనివా్సగౌడ్, డీఈ, హైదరాబాద్
- వెంకట్రావు, ఏఈ, పాల్వంచ
- మోహన్కుమార్, ఏఈ, హైదరాబాద్
- ఫాతిమా, ఏఈ, హైదరాబాద్
- సుందర్, ఏఈ, చివ్వెంల, సూర్యాపేట జిల్లా
- రాంబాబు, ప్లాంట్ అటెండెంట్, ఖమ్మం జిల్లా
- కిరణ్, ప్లాంట్ అటెండెంట్, పాల్వంచ
- వినేశ్, ఎమరాన్ బ్యాటరీస్, హైదరాబాద్
- మహేశ్, ఎమరాన్ బ్యాటరీస్, హైదరాబాద్
ఎంత ప్రయత్నించినా..
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పవర్హౌజ్కు వెళ్లాను. అప్పటికే అక్కడ దట్టమైన పొగ కమ్ముకుంది. ఆక్సిజన్ లేక ఊపిరాడలేదు. లోపలున్న సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరుసార్లు ప్రయత్నించినా ముందుకెళ్లలేకపోయా. మాతోపాటు ఏళ్లతరబడి కలిసి పనిచేసిన ఉద్యోగులను కాపాడుకోలేకపోయా.
ఫోర్మెన్ అశోక్ కుమార్ ఆవేదన
దట్టమైన పొగ ముందుకు సాగని రెస్క్యూ ఆపరేషన్
పవర్ హౌజ్ ప్రమాద సమయంలో సహాయక చర్యలకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆక్సిజన్ అందక సహాయక బృందాలు అవస్థలు పడాల్సి వచ్చింది. 50 అడుగుల దూరం వెళ్లడానికి గంట పట్టింది. దీంతో అధికారులు.. ఒక్కో బృందంలో ఆరుగురు ఉండేలా సహాయక సిబ్బందిని ఏడు బృందాలుగా విభజించారు. గంటకొక బృందాన్ని లోపలకు పంపారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి మెయిన్ కంట్రోల్ రూమ్ వరకు మాత్రమే వెళ్లగలిగిన సహాయక సిబ్బంది.. లోపల చిమ్మచీకటిగా ఉందని, ఆక్సిజన్ అందట్లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆక్సిజన్తో కూడిన ఏడు అంబులెన్స్లను సిద్ధం చేసి రెస్క్యూ టీమ్ బృందాలను అనుసరించేలా పంపారు.
Courtesy Andhrajyothi