– ఫిబ్రవరిలో 7.78 శాతం : సీఎంఐఈ
– ఆందోళనకర స్థాయిలో గణాంకాలు : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం నానాటికి పెరగటమేగానీ, తగ్గుముఖం పడుతున్న దాఖలా కనపడటం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 7.78శాతంగా నమోదైందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) తాజాగా గణాంకాల్ని విడుదల చేసింది. గత నాలుగునెలలతో పోల్చితే ఇది అత్యధికం. గ్రామీణ నిరుద్యోగం జనవరిలో 5.97శాతం ఉండగా, ఫిబ్రవరినాటికి 7.37శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగం 8.65శాతంగా నమోదైంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిందని, ఆర్థిక కార్యకలాపాలు గత ఆరేండ్లలో ఎన్నడూలేనంతగా నెమ్మదించాయని సీఎంఐఈ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రభావం ఆసియా మార్కెట్లపై పెద్ద ఎత్తున ఉందని, ఈనేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ముందు ముందు కోలుకునే అవకాశాలు కనపడటం లేదని వారు వ్యాఖ్యానించారు. గత కొన్నేండ్లుగా మోడీ సర్కార్ ఎంచుకున్న ఆర్థిక విధానాలు ప్రతికూల ఫలితాలు ఇవ్వటం మొదలుపెట్టాయని, నిరుద్యోగం పెరగటం, తయారీరంగం దెబ్బతినటంలో అది కనపడిందని ఆర్థిక నిపుణులు చెప్పారు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ పరిస్థితి మెరుగుపడకపోతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారనీ, కానీ నిరుద్యోగం నానాటికీ పెరగటం ఆందోళన కలిగించే అంశమనీ వారు చెప్పారు.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తామని, ఏటా 2కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని మోడీ నేతృత్వంలోని బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి ఐదేండ్లు దాటినా..దాని ఊసే ఎత్తటం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీ సర్కార్ అమలుజేసిన నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలు ఉన్న ఉద్యోగాల్ని పోయేలా చేశాయని ఐఎంఎఫ్, ఆర్బీఐ మొదలైన సంస్థలే మొత్తుకుంటున్నాయి. దాంతో దేశంలో నిరుద్యోగం మరింతగా పెరగడానికి దారితీసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Courtesy: NT