– ఐసీఎంఆర్ ‘సేరో సర్వే’లో వెల్లడి
– మరో 20 రోజుల్లో అమెరికాను దాటేస్తాం : బిట్స్ పిలానీ
– దేశంలో మొత్తం 45 లక్షల కేసులు, 76 వేలకు పైగా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో వైఫల్యం చెందిందనీ, వాస్తవాలను సైతం వెల్లడించడం లేదంటూ ఇప్పటికీ మోడీ సర్కారుపై సర్వత్రా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న దానికంటే వైరస్ ప్రభావం అధికంగా ఉందని పలు సర్వేలు సైతం ఇదివరకే వెల్లడించాయి. తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైతం దీనిని స్పష్టం చేస్తూ.. విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘సేరో సర్వే’ ఫలితాలను ఐసీఎంఆర్ ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో ప్రచురించిది. ఈ వివరాల ప్రకారం.. మే నెల నాటికే దేశంలో 64 లక్షల మందికి వైరస్ సోకి ఉంటుందని అంచనా వేసింది. వీరిలో 43.3 శాతం మంది 18-45 ఏండ్లు, 39.5 శాతం మంది 46-60 ఏండ్లు, 17.2 శాతం మంది 60 ఏండ్లకు పైబడిన వారిలో కరోనా యాంటీబాడీలను గుర్తించినట్టు సర్వే తెలిపింది. ఈ మేరకు 21 రాష్ట్రాల్లోని 28 వేల మంది రక్త నమూనాలను పరీక్షించారు. పట్టణ ప్రాంతాలు, పని ప్రదేశాల్లో ఉన్నవారిలోనే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా దాదాపు 130 మందికి వైరస్ సంక్రమించే అవకాశముందని సర్వే అంచనా వేసింది.
త్వరలోనే అమెరికాను దాటేస్తాం !
దేశంలో కరోనా ప్రభావం ఇదే రీతిలో కొనసాగితే మరో 20 రోజుల్లో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటుందని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ అంచనా వేసింది. ”దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్ మొదటి వారంలో ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన అమెరికాను భారత్ వెనక్కినెట్టేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 65 లక్షల కేసులు ఉన్నాయి. భారత్లో 45.62 లక్షలు దాటాయి. ఈ సంఖ్య అక్టోబర్ నాటకి 70 లక్షలు దాటే అవకాశముంది” అని బిట్స్ పిలానీ పేర్కొంది. ‘అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ లెర్నింగ్ టెక్నిక్స్’ విధానాన్ని ఉపయోగించి కరోనా సంఖ్యను అంచనా వేశామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అప్లైడ్ మ్యాథమేటిక్స్ విభాగ పరిశోధకురాలు డాక్టర్ టి.ఎస్.ఎల్.రాధిక తెలిపారు.
దేశంలో తాజాగా 96,551 కేసులు, 1,209 మరణాలు
శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 96,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,209 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. మరణాల సంఖ్య 76,271కి పెరిగింది. ప్రస్తుతం 9,43,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 35,42,664 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 77.6 శాతం, మరణాల రేటు 1.7 శాతానికి చేరింది. పాజిటివిటీ రేటు 8.7 శాతానికి పెరిగింది. కాగా, దేశంలో మొత్తం 5,40,97,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
టాప్-10 రాష్ట్రాలు ఇవే !
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (9,90,795 కేసులు), ఆంధ్రప్రదేశ్ (5,37,687), తమిళనాడు (4,86,052), కర్నాటక (4,30,947), ఉత్తరప్రదేశ్ (2,92,029)లు టాప్-5లో ఉన్నాయి. యాక్టివ్ కేసులు సైతం ఈ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. వీటి తర్వాతి స్థానంలో ఢిల్లీ, బెంగాల్, బీహార్, తెలంగాణ, ఒడిశాలు ఉన్నాయి.
Courtesy: NT