– భారీగా పెరగనున్న నిరుద్యోగరేటు
– ఆసియావ్యాప్తంగా 1.48 కోట్ల మంది ఉపాధి కోల్పోవచ్చు :ఏడీబీ-ఐఎల్వో
న్యూఢిల్లీ : కరోనా కంటే ముందే దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం కారణంగా వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత నమోదైంది. కరోనా తీసుకిచ్చిన సంక్షోభంతో ఇది తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ఇక దేశంలో ఇవే పరిస్థితులు కొనసాగితే వచ్చే మూడు నెలల్లో 61 లక్షల మంది యువత (15 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్నవారు) ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో)లు ఒక నివేదికలో వెల్లడించాయి. ఈ మేరకు ‘ఆసియా పసిపిక్ దేశాల్లో కోవిడ్-19 యువత నిరుద్యోగ సంక్షోభ పరిష్కారం’ అనే అంశంపై సర్వే రిపోర్టును మంగళవారం విడుదల చేశారు. ఆసియాలోని 9 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.
నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం… భారత్లో ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే వచ్చే మూడు నెలల్లో 41 లక్షల మంది యువత ఉపాధి కోల్పోతారు. గడిచిన మూడు నెలలతో కలిపితే మొత్తంగా 61 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతవుతాయి. ఇదే సమయంలో నిరుద్యోగరేటు 32.5 శాతానికి చేరనుంది. నిర్మాణ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువమంది ఉపాధి కోల్పోయే ఆస్కారం ఉంది.
ఇక ఆసియావ్యాప్తంగా చూస్తే వచ్చే మూడునెలల్లో పాకిస్థాన్లో 23 లక్షల మంది, బంగ్లాదేశ్లో 16 లక్షల మంది, శ్రీలంకలో 15 లక్షల మంది నిరుద్యోగులవుతారని నివేదిక తెలిపింది. భారత్ కంటే శ్రీలంకలో నిరుద్యోగరేటు ఎక్కువగా (37.8 శాతం) నమోదుకానుంది. మొత్తంగా ఈ సంక్షోభానికి ఆసియా పసిపిక్ రీజియన్లో 1.48 కోట్ల మంది యువత ఉపాధి కోల్పోనున్నారని నివేదిక అంచనా వేసింది. దీన్ని అరికట్టడానికి గానూ ప్రభుత్వాలు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలని నివేదిక సూచించింది. ఈ ఏడాదిలో భారత జీడీపీ వృద్ధిరేటు -4 శాతం నమోదవుతుందని ఏడీబీ-ఐఎల్వో గతంలో అంచనావేసిన విషయం విదితమే.
Courtesy Nava telangana