– 60 శాతం విద్యార్థులు కాలినడకనే..
– బాలికలు మరో 2 శాతం అధికం..
– ప్రజారవాణాలో వెళ్లేది 12 శాతమే..
న్యూఢిల్లీ : దేశానికి స్వతంత్య్రం సిద్ధించి డెబ్బై మూడేండ్లు గడుస్తున్నా.. బడికి వెళ్లే విద్యార్థుల బాధలు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60 శాతానికి పైగా చిన్నారులు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు నడుచుకుంటూనే వెళ్తున్నారు. ప్రజా రవాణా సరిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అసలు రవాణా సదుపాయాలే లేకపోవడంతో భవిష్యత్ భారతమంతా బ్యాగుల భారం మోస్తూ కాలినడకనే బడులకు నడక సాగిస్తున్నారని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్వో) తాజా నివేదికలో వెల్లడైంది. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 59.7 శాతం మంది పాఠశాల విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నారు. వీరిలో బాలురు (57.9 శాతం) కంటే బాలికలే (62 శాతం) ఎక్కువగా ఉన్నారు. ఈ గణాంకాలు పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
రూరల్ ఏరియాలలో 61.4 శాతం మంది బాలురు, 66.5 శాతం మంది బాలికలు కాలినడకనే బడికి వెళ్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది 57.9 శాతం, 62 శాతం గా ఉంది. ఇక ప్రజారవాణాను ఉపయోగించి స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు 12.4 శాతం (గ్రామీణ ప్రాంతాల్లో 11.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం) గా ఉన్నారు. ఇదిలాఉండగా.. ప్రజారవాణాను ఉపయోగించి బడికెళ్తున్న చిన్నారుల్లో 48.3 శాతం మంది మాత్రమే మినహాయింపు పొందుతున్నారని నివేదిక వెల్లడించింది.
Courtesy: NT