– 6లక్షల మంది… బలవంతంగా తరలింపు
– కరోనా సోకిందని 20వేల మంది…
– సిద్ధిపేటలో అర్ధరాత్రి 30 కుటుంబాల్ని తరలించారు : హౌసింగ్, ల్యాండ్రైట్స్ నెట్వర్క్ నివేదిక
న్యూఢిల్లీ : గత నాలుగేండ్లలో సుమారుగా 6లక్షల మందిని బలవంతంగా వేరే చోటకు తరలించారని, కరోనా వైరస్ కారణం చూపి 20వేలమందిని వారి ఇండ్ల నుంచి వెళ్లగొట్టారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇదేమీ సెటిల్మెంట్ చేయకుండా ప్రతిఏటా లక్షలాది మందిని ప్రభుత్వ యంత్రాంగం బలవంతంగా వేరే చోటకు తరలిస్తోంది. ఈనేపథ్యంలో దళితులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో బాధితులుగా మారుతున్నారని ‘హౌసింగ్, ల్యాండ్ రైట్స్ నెట్వర్క్’ తాజా అధ్యయనం పేర్కొన్నది. లాక్డౌన్, కోవిడ్-19 పరిస్థితుల్ని ప్రభుత్వ యంత్రాంగం తమకు అనుకూలంగా మలుచుకుందని, ఎన్నోవేలమందిని వారి వారి స్వంత ఇండ్ల నుంచి బలవంతంగా వేరే చోటకు తరలించిందని నివేదిక తెలిపింది.
ఒక ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ నిమిత్తం, తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో అర్ధరాత్రి 30 కుటుంబాల్ని అధికార యంత్రాంగం ఉన్నఫళంగా వేరే చోటకు తరలించిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో దళిత కుటుంబాలున్నాయని, నష్టపరిహారం అందజేసిన తర్వాతే ప్రభుత్వం ఆ కుటుంబాల్ని తరలించాలన్న కోర్టు తీర్పును సైతం జిల్లా అధికారులు అతిక్రమించారని నివేదికలో తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో భూనిర్వాసితులకు సంబంధించి నివేదిక పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..
ప్రమాణాలు పక్కకు..
వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీలు, దళితులు పెద్ద సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో దాదాపు 5,68,000మందిని ప్రభుత్వ అధికారులు బలవంతంగా వేరే చోటకు తరలించారు. జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు నిర్దేశించిన ప్రమాణాల్ని స్థానిక ప్రభుత్వ యాంత్రాగాలు ఎక్కడా పాటించటం లేదు. ఒక్క మహారాష్ట్రలోనే లక్షమందిని బలవంతంగా వేరేచోటకు తరలించారు. గుజరాత్లో 50వేలమందిని, తమిళనాడులో 99,999మందిని తరలించారు.
-46శాతం బలవంతపు తరలింపులు…నగరాల్లో సుందరీకరణ, బస్తీల్లో నిర్మాణాలు కారణమయ్యాయి.
– నిర్మాణరంగ ప్రాజెక్టుల వల్ల 27శాతం మంది నిర్వాసితులయ్యారు.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ పథకాల కింద 2019లో బలవంతంగా 10వేల మందిని తరలించారు.
– స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ల కింద 2019లో 5వేలమందిని తరలించారు.
– 26 శాతం కేసుల్లో మాత్రమే ముందస్తు నోటీసులు ఇవ్వటం, పునరావాసం కల్పించటం చేశారు.
– నిర్మాణరంగం, అటవీ భూముల సేకరణ, నీటి ప్రాజెక్టులలో 1.49కోట్లమంది భూనిర్వాసితులుగా మారే అవకాశముంది.
Courtesy: NT