- జీహెచ్ఎంసీలో 48% మందిలో ప్రతిరక్షకాలు
- ప్రైవేటు ల్యాబుల పరీక్షల్లో వెల్లడి
- యాంటీబాడీ టెస్టులకు ప్రజల క్యూ
- హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనం: వైద్యులు
- వెలుగుచూస్తున్న తీరు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో కరోనా సోకి, తగ్గిన వారి శాతం చాలా ఎక్కువగా ఉందని ఇటీవల ప్రైవేటు ల్యాబులు నిర్వహించిన యాంటీబాడీ టెస్టుల్లో బహిర్గతమైంది. యాంటీబాడీ పరీక్షలు చేయించుకున్న వారిలో సగం (48ు) మందిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) విడుదలైనట్లు వెల్లడైంది. సీసీఎంబీ, ఐఐసీటీ శాస్త్రవేత్తల సంయుక్త బృందం ఇటీవల హైదరాబాద్లోని మురుగునీటి శాంపిళ్లను పరీక్షించింది. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్లో గత 35 రోజుల వ్యవధిలో 6.6లక్షల మందికి కరోనా వచ్చి, తగ్గిపోయి ఉంటుందనే అంచనాకు వచ్చారు. ప్రైవేటు ల్యాబుల పరీక్షల్లో వస్తున్న ఫలితాలు.. సీసీఎంబీ నివేదికకు బలం చేకూరుస్తున్నాయి.
ఆగస్టు మొదటివారం నుంచే..
రాష్ట్రంలో మొత్తం 28 ల్యాబ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. ప్రైవేట్ ల్యాబ్లు జూన్ 16 నుంచి ఆర్టీ- పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీపీసీఆర్ టెస్టులతో పాటే యాంటీబాడీ టెస్టులు నిర్వహించుకోవచ్చని, అందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని ఐసీఎంఆర్ సూచించింది. అయినా తెలంగాణలో ఆగస్టు మొదటి వారం నుంచే కొన్ని ప్రైవేటు ల్యాబ్లు ఈ టెస్టులు చేస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ.1200 వసూలు చేస్తున్నాయి. ఒక ప్రముఖ ప్రైవేటు ల్యాబ్లో ఆగస్టు 1 నుంచి 20 వరకు 5,100 మంది యాంటీబాడీ పరీక్షలు చేయించుకోగా, వారిలో 48ు మందిలో ప్రతిరక్షకాలు విడుదలైనట్లు తేలింది. మరో ల్యాబ్లోనూ నిర్ధారణ పరీక్ష కోసం వచ్చిన నమూనాల్లో 46.5ు మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు స్పష్టమైంది. ఇంకో ల్యాబ్లో రోజుకు 650-700 ఆర్టీ-పీసీఆర్ టెస్టులు.. 300 యాంటీబాడీ పరీక్షలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున యాంటీబాడీ టెస్టులు చేస్తే సగటున 50ు మందిలో యాంటీబాడీలను గుర్తించే అవకాశాలు ఉంటాయని ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్థాయిలో యాంటీబాడీలు వృద్ధి చెందడం మంచి పరిణామేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు బయటపడనివారిలో తక్కువే..
చాలామంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడి టెస్టులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. లేదంటే.. హోం ఐసొలేషన్లో ఉండిపోతున్నారు. 21 రోజుల తర్వాత తమకు వైరస్ సోకిందో లేదోనన్న అనుమానంతో ఒకసారి యాంటీబాడీ టెస్టు కోసం వస్తున్నారు. ఈ తరహా ధోరణి ఇటీవల ఎక్కువైందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ప్రైవేటు ల్యాబ్లలో యాంటీబాడీ పరీక్షలకు వస్తున్న వారిలో మెజార్టీ ప్రజలు ఇటువంటి వారేనని ల్యాబుల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకి లక్షణాలు బయటపడని వారిలో ప్రతిరక్షకాలు అనుకున్నంతగా వృద్ధి చెందడం లేదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో 42.81% మందిలో ప్రతిరక్షకాలు వృద్ధి చెందగా, వారిలో 40.51% మందికి తమకు వైరస్ వచ్చిపోయిందనే విషయం కూడా తెలియదు.
హెర్డ్ ఇమ్యూనిటీ దిశగానే..
యాంటీబాడీ టెస్టులు చేయించుకుంటున్న వారిలో 48 శాతం మందిలో ప్రతిరక్షకాలు వృద్ధి చెందడం మంచి పరిణామమే. ఒక రకంగా మనం కూడా హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తున్నట్టే లెక్క. బహుశా అందువల్లేనేమో.. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా కొంత తగ్గింది. చాలా మంది ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు.
డాక్టర్ బొల్లినేని భాస్కరరావు
ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ట్రెండ్
వివిధ రాష్ట్రాల్లో చేసిన సీరో సర్వేల్లోనూ ఇలాంటి ఫలితమే వచ్చింది. అంటే హైదరాబాద్ సహా దేశమంతా దాదాపు ఒకే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. దీనివల్ల త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకోగలుగుతాం. మరణాలు కూడా తక్కువగా సంభవిస్తాయి. తక్కువ నష్టంతోనే కరోనా కల్లోలం నుంచి బయటపడగలుగుతాం.
డాక్టర్ మాదల కిరణ్
Courtesy Andhrajyothi