- అన్నదాతకు కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు
- భారీ వర్షాలకు నీట మునుగుతున్న పంటలు
- ఆగస్టులో 50 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
- ఈ నెలలో మరో రెండు లక్షల ఎకరాల్లో మునక
- మొక్కజొన్న, సోయాపై ఆశలు వదులుకోవాల్సిందే
- చేతికందే దశలోని పెసర, కందిపై పెద్ద దెబ్బ
- ఉమ్మడి నల్లగొండలో 90 వేల ఎకరాల్లో నష్టం
- సోయా, పత్తి పూర్తిగా దెబ్బతిన్నాయి
- పెట్టుబడీ దక్కేలా లేదు.. పరిహారం చెల్లించండి
- జుక్కల్ తహసీల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు 38 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో వరి, 22 వేల ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నాయి. జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అధిక వర్షాలకు 50 వేల ఎకరాల్లోని పంట చేతికి రాకుండా పోతోంది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏకధాటి వానలు అన్నదాతకు కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలోని ఆరుతడి పంటలు చేజారిపోనుండగా.. కీలక దశలోని మిగతా పంటలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఆగస్టు నెలలో ఎడతెరిపి లేని వానలకు ప్రధానంగా ఉమ్మడి వరంగల్, మిగతా జిల్లాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరులో ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్రమంతా పంటలపై వర్షాల ప్రభావం పడినట్లైంది. కాగా, ఆగస్టులో 3.50 లక్షల ఎకరాల్లో, తాజాగా 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలవారీగా ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన..
- జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, సారంగాపూర్, గొల్లపల్లి, మేడిపల్లి, రాయికల్, మల్యాల, మల్లాపూర్, పెగడపల్లి, మెట్పల్లి, వెల్గటూర్, కోరుట్ల, కథలాపూర్ మండలాల్లో 8 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. 2,300 ఎకరాల్లో మొక్కజొన్న, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్టులో 1,226 ఎకరాల్లో, ఇప్పుడు 3 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2,975 ఎకరాల్లో పత్తి, 480 ఎకరాల్లో వరి నీట మునిగాయి. కాగజ్నగర్ డివిజన్లోని బె జ్జూరు, చింతలమానేపల్లి, పెంచికలపేట, దహెగాం, కౌటాల మండలాలు, ప్రాణహిత పరివాహకంలోని గ్రామాలకు వరద పోటెత్తింది. తిరుగు జలాలతో మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో 6 వేల ఎకరాల్లో పత్తి, 500 ఎకరాల్లో వరి మునిగిపోయాయి. నిర్మల్ జిల్లా కుబీర్, తానూర్, బైంసా, ముధోల్, బాసర మండలాల్లో పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. 50 వేల ఎకరాల్లో కోతకొచ్చిన సోయా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
- మహబూబ్నగర్ జిల్లాలో 4,300 ఎకరాల్లో పత్తి, 650 ఎకరాల్లో కంది, 1400 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో జొన్నకు నష్టం కలిగింది. వనపర్తి జిల్లాలో ఆగస్టులో 5 వేల ఎకరాల్లో, ఈ నెలలో 10 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. నారాయణపేట జిల్లాలో 8,455 ఎకరాల్లో పత్తి, 7,444 ఎకరాల్లో కంది, 901 ఎకరాల్లో వరి, 560 ఎకరాల్లోని జొన్న పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. నాగర్కర్నూల్ జిల్లాలో నల్ల రేగడి నేలల్లోని పత్తి పంటకు 70 శాతం, చెలక నేలల్లో సాగు చేసిన పత్తికి 50 శాతం వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్ల్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
- వికారాబాద్ జిల్లాలో 15,477 ఎకరాల్లో పత్తి, 9,766 ఎకరాల్లో కందులు, 4,747 ఎకరాల్లో వరి, పెసర, సోయా బీన్పై ఆశలు సన్నగిల్లాయి. నష్టం విలువ రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లాలో 500 ఎకరాల్లో వరి, పత్తి, కంది దెబ్బతినగా.. నష్టం రూ.63 లక్షలని అంచనా వేశారు. మేడ్చల్ జిల్లాలో 98 ఎకరాల విస్తీర్ణంలో వరి నీట మునిగింది. సుమారు రూ. 80 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు రూ.30 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. 1,949 ఎకరాల్లో వరి, 1,574 ఎకరాల్లో పత్తి, 20,311 ఎకరాల్లో పెసర దెబ్బతిన్నాయి. 12,024 మంది రైతులు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిర్చి నారు మొలకెత్తలేదు. మొలిచినవి కూడా వర్షానికి పోయాయి. మళ్లీ మిర్చి నారు కొనుగోలు రైతులకు భారం కానుంది. జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరులో 14,650 ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. పత్తి 8,402 ఎకరాల్లో దెబ్బతిన్నది. 2 వేల ఎకరాల్లో మిర్చికి నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల్లో 22 వేల మంది రైతులకు చెందిన 46 వేల ఎకరాల్లోని పంటను వర్షాలకు ప్రభావితమైంది.
Courtesy Andhrajyothi