– భద్రతా దళాల అంతర్గత నివేదిక
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించినప్పటి నుంచి గత రెండు నెలల్లో 306 రాళ్లురువ్విన ఘటనలు జరిగాయని భద్రతా దళాల అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఘటనల్లో 100మంది భద్రతా సిబ్బంది, 89 మంది కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన కమాండోలు గాయపడ్డారని పేర్కొన్నారు. శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలో సెప్టెంబర్ 4న చేపట్టిన నిరసన ర్యాలీపై భద్రతా దళాలు పెల్లెట్లు వినియోగించామని, దీంతో గాయాలపాలైన తొమ్మిదో తరగతి విద్యార్థి అసర్ అహ్మద్ ఖాన్ మృతిచెందినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందన్న కేంద్ర ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా ఈ నివేదిక వెలువడటం గమనార్హం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. ఈ రెండు నెలల్లో వరుసగా ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. 10మంది ఉగ్రవాదులు మృతిచెందారని రికార్టుల్లో పేర్కొన్నారు. రెండు గ్రెనేడ్ దాడులు జరిగాయని తెలిపారు.
చెదురుమదురు ఘటనలు తప్ప కాశ్మీర్లోయ శాంతియుతంగా ఉందనీ, 2016లో బుర్హాన్వాని మృతి అనంతరం చెలరేగిన ఆందోళనల కంటే చాలా తక్కువ హింసాత్మక ఘటనలు జరిగాయని రాష్ట్ర అధికారులు వెల్లడించారు. అలాగే 2019 మొదటి ఆరునెలల్లో, కేవలం 40 రాళ్ల రువ్వే ఘటనలు మాత్రమే జరిగాయని గతంలో అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఆగస్టు 6 నుంచి రాష్ట్రంలో ప్రత్యేక ఆంక్షలు విధించారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత భద్రతతో కూడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన జమ్మూకాశ్మీర్లో మరింత అదనపు దళాలను మోహరించడమే కాకుండా, ఇంటర్నెట్, ల్యాండ్లైన్ సేవలను రద్దు చేసింది. ప్రాంతీయ పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో పాటు సుమారు 4వేల మందిని అదుపులోకి తీసుకుంది.
Courtesy Navatelangana