హైదరాబాద్: కరెంట్ చావులకు దిక్కులేకుండా పోయింది. ఏయేటికాయేడు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాల్సి ఉండగా… అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే పరిహారం మాత్రం మృతులందరికీ చేరడం లేదు. ఒక్క నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఎన్పీడీసీఎల్) పరిధిలో 2014 నుంచి 2020 దాకా 3008 మంది కరెంట్ షాక్తో చనిపోగా… పరిహారం మాత్రం 1197 మందికే చేరింది. సమాచార హక్కు కార్యకర్త జలగం సుధీర్ ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరగా… ఈ విషయాలు వెల్లడయ్యాయి.
రెండు డిస్కమ్ల నుంచి సమాచారం కోసం దరఖాస్తు చేసుకోగా… ఒక్క ఎన్పీడీసీఎల్ మాత్రమే స్పందించడం గమనార్హం. అయితే ఈ లెక్కలన్నీ అధికారిక జాబితాలో చేరినవే కాగా… జాబితాలో ఎక్కకుండా మాయం చేసిన కేసులకు లెక్కే లేదు. చనిపోయినవారందరికీ నిర్ణీత వ్యవధిలోగా పరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎ్సఈఆర్సీ) ఆదేశాలివ్వగా… వాటిని అమలు చేసేందుకు విద్యుత్ సంస్థలు నిరాకరిస్తున్నాయి. విద్యుత్ షాక్తో చనిపోతే… చనిపోయిన రోజు నుంచి రెండు నెలల్లోపు ఆ కుటుంబానికి సహాయం అందించాలి.
పరిహారం చెల్లించడంలో ఆలస్యం జరిగితే 12 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని ఈఆర్సీ ఆదేశాలున్నాయి. ఏళ్లు గడుస్తున్నా మృతుల కుటుంబాలకు పరిహారం చేరడం లేదు. పరిహారం విషయంలో శాఖలో నిర్లక్ష్యమే కాకుండా చాంతాడంత నిబంధనల వల్ల సహాయం ఆలస్యమవుతోంది. కరెంట్ షాక్తో చనిపోగానే ఎఫ్ఐఆర్ నమోదుకావాలి. ఆ తర్వాత పంచనామా, పోస్టుమార్టం నివేదికలు, మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా వారసత్వ ధ్రువీకరణతోనే చిక్కులు అధికంగా ఉంటాయి. వారసత్వ ధ్రువీకరణకే ఏడాదికి పైగా సమయం పడుతుంది. పరిహారం కోసం అనేక నిబంధనలు పెట్టేసి… బాధిత కుటుంబాలకు సహాయం చేరకుండా చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
Courtesy Andhrajyothi