– మెజార్టీ వాటాల విక్రయానికి ప్రణాళికలు
– సమాచార హక్కు చట్టంతో వెల్లడి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పూర్తిగా దోచిపెట్టే పనిలో నిమగమైంది. ఇప్పటి వరకు పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తూ వచ్చిన మోడీ సర్కార్ ఇకపై ఏకంగా వాటిని తెగనమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 26 పీఎస్యూలను ప్రయివేటీకరించడానికి జాబితాను సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఎయిరిండియా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, పవన్ హాన్స్ లాంటి కీలక సంస్థలు కూడా ఉన్నాయని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తేలింది. 23 సంస్థల ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది. మిగతా వాటిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
ఇప్పటి వరకు 26 పీఎస్యూల్లో వాటాల విక్రయానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ (దీపం) జాబితాను రూపొందించినట్టు తాజాగా ఆర్టీఐ సమాచారంతో వెల్లడయ్యింది. చండీగడ్కు చెందిన అమన్సేతి సమాచారం హక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించారు. ఆగస్టు 24 నాటికి డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన 26 పీఎస్యూల జాబితాను తయారు చేసినట్టు దీపమ్ వెల్లడించింది.
కాగా ఏ సంస్థలో ఎంత వాటాను విక్రయించనున్నారనే మరో ప్రశ్నకు.. ఇప్పుడే దీన్ని చెప్పలేమనే సమాధానం ఇచ్చింది. ఆయా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎంత వాటాను విక్రయించాలనేది అప్పుడే నిర్ణయిస్తామని తెలిపింది. 2020-21లో పీఎస్యూల్లో రూ.2.10 లక్షల కోట్ల విలువ చేసే డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందిన రూ.1.20 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను, మిగతా రూ.90వేల కోట్ల వాటాలను విత్త సంస్థల నుంచి ఉపసంహరించుకోవాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హిందుస్తాన్ ఎరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో వాటాలను విక్రయించింది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలోనూ వాటా విక్రయాన్ని వేగవంతం చేస్తున్న విషయం తెలిసిందే.
డిజిన్వెస్ట్మెంట్ జాబితాలోనివి…
ఎయిరిండియా, ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్, పవన్ హాన్స్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. బిఅండ్ఆర్ కంపెనీ, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, సిమెంట్ క్రాప్ ఇండి యా, ఇండియన్ మెడిసిన్ అండ్ ఫార్మాసిటికల్, సలేమ్ స్టీల్ ప్లాంట్. బద్రావతి స్టీల్ ప్లాంట్. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఫెర్రో స్క్రాప్ నిగమ్, ఎన్డిఎంసి, నాగర్నర్ స్టీల్ ప్లాంట్, భారత్ ఎర్త్ మూవర్స్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్, భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్. నిల్చల్ ఇస్పాట్ నిగమ్, హిందుస్థాన్ ప్రిఫాబ్, భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్, స్కూటర్స్ ఇండియా, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్, కర్నాటక ఆంటీబయోటిక్స్ అండ్ ఫార్మా, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మా, హిందుస్థాన్ ఆంటీబయోటిక్స్, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్, హిందుస్థాన్ ఫ్లోరోకార్పన్.
Courtesy: NT