– 4442 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ, సిట్టింగ్ సభ్యులు : సుప్రీంకోర్టు నివేదిక
న్యూఢిల్లీ: రాజకీయాల్లో నేరచరిత్ర ఉన్న నాయకుల పాత్ర రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా వందల మంది నాయకులు నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. దేశంలో ప్రస్తుత చట్టసభ సభ్యులపైనే 2,556 పెండింగ్ కేసులు ఉన్నట్టు సుప్రీంకోర్టు తాజా నివేదికలో వెల్లడైంది. గతంలో పనిచేసిన, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై 4,442 నేరపూరిత కేసులు పెండింగులో ఉన్నాయనీ, అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు ఈ మేరకు అందించిన నివేదికలో ప్రస్తావించాయి. వీరిలో ఎక్కువగా అవినీతి, మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పరువునష్టం కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని తెలిపాయి. చట్టసభసభ్యులపై ఉన్న నేరారోపణల కేసులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పెండింగ్ కేసుల పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు కోరింది. పార్లమెంట్తోపాటు వివిధ రాష్ట్రాల చట్టసభ సభ్యులపై పెండింగులో ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్లకు సూచించింది.
తాజాగా అన్ని హైకోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ సభ్యులపై నాలుగు వేలకుపైగా నేరపూరిత కేసులు పెండింగులో ఉన్నట్టు తేలింది. వీరిలో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2,556 కేసుల విచారణ పెండింగులో ఉన్నదని నివేదికలో వెల్లడైంది. అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా ఉన్న సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత చట్టసభ సభ్యులపై 2,556 కేసులు ఉండగా.. వీరిలో కొందరిపై ఒకటికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 413 జీవిత ఖైదుకు సంబంధమున్న కేసులే ఉండగా, వీటిలో 174మంది ప్రస్తుత చట్టసభ సభ్యులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో 352 కేసుల విచారణపై ఆయా రాష్ట్రాల హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు స్టే విధించినట్టు నివేదిక పేర్కొంది.
యూపీ లీడర్లపైనే ఎక్కువ కేసులు..!
నాయకులపై ఉన్న కేసుల్లో ఎక్కువగా ఉత్తర్ప్రదేశ్లోని చట్టసభ సభ్యులపైనే ఉన్నట్టు తేలింది. అక్కడి నాయకులపై 1217 కేసులు ఉండగా, వీటిలో 446 ప్రస్తుత చట్టసభ సభ్యులపై ఉన్నాయి. యూపీ తర్వాత స్థానంలో బీహార్ది. ఇక్కడ 531కేసులు ఉండగా, వీరిలో 256 ప్రస్తుత సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు నివేదిక స్పష్టంచేసింది. వీటిని త్వరగా విచారణ చేపట్టడంలో భాగంగా ఎమ్మెల్యే/ఎంపీల కేసులను విచారించేందుకు ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ సూచించారు. అంతేకాకుండా ప్రతి హైకోర్టు ఈ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
Courtesy: NT