- దేశంలో 64,531 కొత్త కేసులు
- వెయ్యికిపైగా కొవిడ్ మరణాలు
దిల్లీ: దేశంలో ఓవైపు కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండగా.. మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య(రికవరీ) కూడా పెరుగుతోంది. ఇంతవరకు 27.67 లక్షల మంది మహమ్మారి బారిన పడగా 20.37 లక్షల మంది కోలుకున్నారు. గతంలో ఎన్నడూలేనంతగా బుధవారం నాడు 24 గంటల్లో 60,091 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. దీంతో రికవరీ రేటు 73.64%కి చేరింది. నాలుగు వారాల క్రితంతో పోలిస్తే ఇది దాదాపు 10% పెరిగింది. ఇదే సమయంలో మరణాల రేటు 2.4% నుంచి 1.91%కి తగ్గింది. కాగా కొత్త కేసులు, మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగానే ఉంది. గత రెండు రోజులుగా కొత్త కేసులు 60 వేల లోపు నమోదు కాగా బుధవారం 24 గంటల్లో 64,531 కొత్త కేసులొచ్చాయి.. 1,092 మంది చనిపోయారు. ఈనెలలో వెయ్యి దాటి మరణాలు సంభవించడం ఇది మూడోసారి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
* రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కర్ణాటక తొలిసారి 7వేల మార్క్ని దాటింది. పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్లలో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులొచ్చాయి.
* దేశంలో బుధవారం నాటికి మొత్తం 6,76,514 (24.45%) యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు కొవిడ్ రోగులు 1/4వ వంతు కంటే తక్కువగా ఉండటం పరిస్థితుల మెరుగునకు నిదర్శనమని పేర్కొంది.
* దేశంలో పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. నెలక్రితం ఇది 11.3% ఉండగా తర్వాత క్రమేపీ తగ్గుతూ 7.7%కి చేరింది.
* మొత్తంగా ఇంతవరకు 3,17,42,782 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. మంగళవారం 8,01,518 శాంపిళ్లను పరీక్షించారు.
Courtesy Eenadu