- శ్రీశైలంలోని మొత్తం ఆరు యూనిట్లలో రెండు సేఫ్
- పరిశీలన తర్వాత తేలనున్న
- మరో రెండింటి భవితవ్యం
- పవర్హౌస్లోకి వెళ్లగలిగిన అధికారుల బృందం
- నష్టం అంచనాలపై నేటి నుంచి పరిశీలన?
- రెండు వారాల్లో 2 యూనిట్ల ప్రారంభానికి కసరత్తు
హైదరబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంతో రెండు యూనిట్లకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరో రెండు యూనిట్లు సురక్షితంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన రెండు యూనిట్ల భవితవ్యం ఏమిటన్నది పరిశీలన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా విద్యుత్తు కేంద్రం లోపలకు పూర్తిగా పోలేని పరిస్థితే ఉంది. టన్నెల్ కావడంతో ఇంకా వేడి ఆవరించి ఉంది. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావుకు అందిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి టన్నెల్ లోపలకు వెళ్లడానికి మార్గం సుగమమైంది. మంగళవారం సులువుగా లోపలకు వెళ్లి నష్టం అంచనా మొదలు పెట్టవచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నా అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది.
ప్రమాద సమయంలో విధుల్లో ఉండి సురక్షితంగా బయటపడిన ఇంజినీర్లు తెలిపిన సమాచారం ప్రకారం.. నాలుగో యూనిట్లో మొదలైన మంటలు 5, 6 యూనిట్లకు వేగంగా వ్యాపించాయి. 1, 2 యూనిట్లకు మాత్రం పెద్దగా ప్రమాదం వాటిల్లలేదని విద్యుత్తు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని 16 రోజుల్లో తిరిగి ప్రారంభించగలమనే భావనలో జెన్కో ఉంది. ఇందు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎండీ ప్రభాకర్రావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. అయితే.. ఇది అంతా కూడా ప్రాథమిక అంచనానే. ఒక్కో యూనిట్లో ప్యానల్ బోర్డు, జనరేటర్ను సాంకేతికంగా పరిశీలించిన తర్వాతే నష్టం ఏ మేరకు జరిగింది? ఎంత జరిగింది? అనే అంచనాకు రాగలమని జెన్కో చెబుతోంది.
కాలిన కాపర్ కండక్టర్!
యూనిట్లలోని ప్యానల్స్ను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. ఇందులో బ్రేకర్లు, ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. వీటిల్లోనే తొలుత మంటలు వచ్చాయని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి నాలుగో యూనిట్ వరకూ వెళ్లగలిగిన జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, సచ్చిదానందం, అజయ్, ఇతర ఇంజినీర్లు.. పలు విభాగాలను పరిశీలించారు. 4వ యూనిట్లో అవుట్పుట్ టెర్మినల్ దగ్గర కాపర్ కండక్టర్ కాలిపోయి (మెల్ట్) ఉండడం వారు గుర్తించినట్లు తెలిసింది. ఇక్కడి నుంచే అగ్ని కీలలు వ్యాపించి ఉంటాయన్న భావనకు వారి పరిశీలన బలం చేకూరుస్తోంది. ప్రమాదాన్ని బయట నుంచే చూశారే తప్ప దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేస్తేనే నష్టం అక్కడకే పరిమితం అయిందా? జనరేటర్కు కూడా వ్యాపించిందా? అన్నది తేలనుంది. జెన్కో భయపడుతున్నట్లు 5, 6 యూనిట్ల జనరేటర్లు కూడా కాలిపోతే నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది.
యూనిట్లలోని జనరేటర్లను మిట్సుబిషీ, టర్బైన్లను హిటాచీ కంపెనీ సరఫరా చేసింది. కాంట్రాక్టు పొందిన సుమిటో కంపెనీ.. జనరేటర్ ఒకరి నుంచి టర్బైన్ను మరొకరి నుంచి తీసుకొచ్చింది. ఇపుడు వారిని పిలవాలా? లేదా? అన్నది సాంకేతిక నిపుణుల పరిశీలన తర్వాతే తేలనుంది. ట్రాన్స్ఫార్మర్లో ప్రమాదం జరిగితే ఫీజు ఎగిరిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.. ఇంత పెద్ద విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించినా ట్రిప్ కాకపోవడం.. వ్యవస్థలో ఎక్కడో లోపం ఏర్పడిందనే విషయాన్ని తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. ఆ లోపాన్ని గుర్తించినప్పుడే అగ్ని ప్రమాదానికి మూలం తెలియవచ్చంటున్నారు. పవర్హౌ్సలో బ్యాటరీ బ్యాంకు నెలకొల్పే పనులూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పనుల పరంగా ఏమైనా సమస్య తలెత్తిందా? అన్న విషయమూ నిపుణుల పరిశీలనలో తేలనుంది.
నష్టం ఎంత?
శ్రీశైలం పవర్హౌ్సలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి. అగ్నికీలలు ప్యానల్ బోర్డులకే పరిమితమైతే నష్టం ఎక్కువగా ఉండకపోవచ్చని అంటున్నారు. జనరేటర్లు కూడా పాడైతే నష్టం భారీగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఒక్కో యూనిట్ను ఓపెన్ చేస్తూ వెళ్లే కొద్దీ వివరాలు వెల్లడికానున్నాయి. అందుకే విద్యుత్ కేంద్రం పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందనే విషయం ఇపుడే చెప్పడం కష్టమని జెన్కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక యూనిట్లో జనరేటర్ కాలిపోయి పూర్తిగా పనికి రాకపోతే నష్టం రూ.30-40 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఈ పరిస్థితే ఏర్పడితే నష్టం రూ.వందల కోట్లలో ఉండే ప్రమాదముంది. కాగా, కాలం చెల్లిన డీసీ(బ్యాటరీల) స్థానంలో కొత్త వాటిని పెట్టాలన్న నిర్ణయం అమలులో తీవ్ర జాప్యం జరిగిందన్న విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. రెండేళ్ల కిందటే అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్కుమార్ దీనిపై నివేదిక ఇవ్వగా… ఓ చీఫ్ ఇంజనీర్ తొక్కిపెట్టినట్లు సమాచారం. ఇటీవలే ప్లాంట్ను సందర్శించిన జెన్కో సీఎండీ ప్రభాకర్రావు దృష్టికి ఈ అంశం రాగా… ఆయన ఆదేశాలతో కొత్త డీసీలు అమర్చే పనులు ప్రారంభమైనట్టు తెలిసింది.
ఆగిన ఉత్పత్తి.. రోజుకు 8కోట్ల నష్టం
అగ్ని ప్రమాదంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు రూ.8కోట్ల మేర నష్టాన్ని మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. కృష్ణాలో నీళ్లు బాగా ఉన్న నేపథ్యంలో 815 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాగార్జునసాగర్లో ఈనెల 23న 15.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. శ్రీశైలం 900 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. దీన్నిబట్టి సాగర్ ప్రాజెక్టు కంటే ఇక్కడ ఎక్కువ విద్యుత్తు వచ్చేది. ఈ సీజన్లో శ్రీశైలం పవర్హౌస్ నుంచి 67.60 కోట్ల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయింది. అంటే యూనిట్కు రూ.4 చొప్పున రూ.267కోట్ల విలువైన విద్యుత్తును రాష్ట్రానికి అందించింది. తాజా ప్రమాదంతో జలాశయం నిండుగా ఉన్న సమయంలో విద్యుత్ను ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
నాలుగో యూనిట్ నుంచే మంటలు
సీఐడీ విచారణలో ఆధారాలు లభ్యం
నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానల్ బోర్డులో షార్ట్సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు అన్ని యూనిట్లకు విస్తరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ చీఫ్ గోవింద్సింగ్ నేతృత్వంలోని 25 మంది సభ్యుల బృందం శని, ఆదివారాల్లో పవర్హౌ్సను సందర్శించి కీలక ఆధారాలను సేకరించింది. ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన అధికారులు.. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను అందించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, అగ్ని ప్రమాద సమయంలో వెలువడిన కార్బన్ కారణంగా పవర్హౌస్ మొత్తం నల్లగా మారిపోయింది. శుద్ధి చేయకుండా లోపలికి వెళ్తే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని జెన్కో సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, అగ్ని ప్రమాదంపై జెన్కో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ విచారణ ప్రారంభించింది. జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సైతం మంగళవారం శ్రీశైలం ఎడమ గట్టు పవర్హౌజ్ను సందర్శించనున్నట్లు తెలిసింది. కాగా, మృతి చెందిన ఉద్యోగులకు నివాళులర్పిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జెన్కో కాలనీ నుంచి శక్తిసదన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జెన్కో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Courtesy Andhrajyothi