– బీహార్, యూపీల్లో అత్యధికం
– లోక్సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 17.1శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వివరించారు. ఈ మేరకు లోక్సభలో ఆయన లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఈ ఖాళీలు అత్యధికంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాలైన బీహార్, యూపీల్లోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఎన్డీయే పాలిత రాష్ట్రం బీహార్లో అత్యధికంగా 2.7 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఇప్పటికే విద్య విషయంలో వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ పాలిత మరో రాష్ట్రం ఉత్తరప్రదేశ్(2.1 లక్షలు) ఉన్నది. ఇక శాతాలవారీగా చూసుకుంటే సిక్కింలో అత్యధికంగా 57.5శాతం ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. ”టీచర్ల నియామకం అనేది ఒక నిరంతర ప్రక్రియ. రిటైర్మెంట్లు, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ ఖాళీలు పెరుగుతున్నాయి. ఈ నియామకాలు, సర్వీసు కండిషన్లు, టీచర్ల విధులకు సంబంధించిన అంశాలు సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి” అని కేంద్ర మంత్రి వివరణ ఇవ్వడం గమనార్హం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో జార్ఖండ్ (40.1శాతం), బీహార్ (39.9శాతం), ఉత్తరప్రదేశ్ (28.8శాతం), ఉత్తరాఖండ్ (24.3శాతం), ఛత్తీస్గఢ్ (21.7శాతం) లు ఉన్నాయి.
కేటాయించినవి 61.8 లక్షలు.. ఖాళీలు 10.6 లక్షలు
2020-21 విద్యాసంవత్సరానికి గానూ దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం కేటాయించబడిన 61.8 లక్షల పోస్టులకు గానూ 10.6 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక టీచింగ్ పోస్టుల ఖాళీలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మిజోరాం(ఇక్కడ ఒక్క ఖాళీ కూడా లేదు), మహారాష్ట్ర (0.8శాతం), తమిళనాడు (1.4శాతం), పంజాబ్ (2.2శాతం), గుజరాత్ (2.6శాతం), నాగాలాండ్ (2.7శాతం), కేరళ (2.8శాతం) వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఐదు శాతం కంటే తక్కువగానే ఉన్నాయి.
తెలంగాణలో 12.7శాతం.. ఆంధ్రలో14.1శాతం ఖాళీలు
దేశంలోని పది రాష్ట్రాల్లో ఈ ఖాళీలు 11.1శాతం నుంచి 19.5శాతం మధ్య ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. శాతాలవారీగా చూసుకుంటే.. మధ్యప్రదేశ్ (19.5శాతం), జమ్మూకాశ్మీర్ (16.6శాతం), కర్నాటక (14.2శాతం), ఆంధ్రప్రదేశ్ (14.1శాతం), మణిపూర్ (13శాతం), తెలంగాణ (12.7శాతం), పశ్చిమబెంగాల్ (11.3శాతం), ఢిల్లీ (11.1శాతం) వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
Courtesy: NT