– దశలవారీగా అప్పగించనున్న మోడీ సర్కారు
న్యూఢిల్లీ : భారత అతి పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేను ప్రయివేటుపరం చేయ డానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇటీ వలే ప్రభుత్వ పట్టాలపై ప్రయివేటు రైలును నడిపిన కేంద్రం.. త్వరలోనే మరో 150 రైళ్లను, 50 రైల్వేస్టేషన్లను కార్పొరేట్లకు కట్టబెట్టనున్నట్టు తెలుస్తున్నది. దశలవారీగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారని సమాచారం. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మెన్ వికె యాదవ్కు నిటిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఇటీవలే ఓ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రం పలువురు అధికారులతో ఓ ప్యానెల్ను ఏర్పాటుచేయనున్నదనీ, అది ఇచ్చే నివేదిక మేరకు స్టేషన్లను ప్రయివేటీకరించడంపై నిర్ణయం తీసుకుంటామని అమితాబ్ కాంత్ చెప్పారు. దేశంలోని సుమారు 400 రైల్వేస్టేషన్లను ప్రపంచస్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దీనిపై అమితాబ్కాంత్ మాట్లాడుతూ.. ఈ విషయంపై రైల్వే మంత్రితో సుదీర్ఘంగా చర్చించామనీ, ప్రస్తుతం 50 రైల్వేస్టేషన్లను సుందరీకరించే ప్రక్రియను చేపడతామని చెప్పారు. గతేడాది విమానాశ్రాయాలను ప్రయివేటు వాళ్లకిచ్చినట్టే రైల్వేస్టేషన్లనూ ఇవ్వడానికి ప్యానెల్ సూచనలు పాటిస్తామని ఆయన తెలిపారు.
Courtesy navatelangana