– గ్రామాలకు వైద్యుల రాక బంద్
– తగ్గిన ఔషధాలు…
– ఆర్నెళ్లుగా జీతాలకు లేక సిబ్బంది విల విల
– మరమ్మతులకో నోచుకోని వాహనాలు
– రూ.15 కోట్లకు పడిపోయిన కేటాయింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్యంపై అవగాహన, ఇంటింటికి వైద్యసేవలంనందిస్తున్న 104 వాహనాలసేవలు ఇక మీదట కూడా కొనసాగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. తాజా బడ్జెట్ లో 104 సేవలకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించడంతో గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతున్నది. 2008లో ఈ సేవలు ప్రారంభించే సమయానికి రూ.100 కోట్ల కేటాయింపులు చేశారు. ఇవి కాస్తా 2019-20 నాటికి రూ.15 కోట్లకు పడిపోయాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రంలో రూ.50 కోట్ల వరకున్న బడ్జెట్ కాస్తా గత సంవత్సరం రూ.35 కోట్లకు తగ్గించారు. ఈ సంవత్సరం అందులోనూ రూ.20 కోట్లకు తగ్గించారు. 104 వాహనాల సేవల ప్రారంభంలో వాహనం వెంట గ్రామాలకు వైద్యులు కూడా వెళ్లి రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఇచ్చే వారు. అయితే క్రమక్రమేణా వాహనాల నుంచి వైద్యులను తప్పించారు. ప్రస్తుతం డ్రైవర్ తో పాటు ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కో గ్రామానికి నిర్దేశించిన రోజు (ఫిక్స్ డ్ డే హెల్త్ సర్వీసెస్) వెళుతున్నారు. బీపీ, మధుమేహం, ఫిట్స్, అస్తమా తదితర దీర్ఘకాలిక రోగులకు అవసరమైన ఔషధాలతో పాటు చిన్నపిల్లలు, గర్భిణీలు, తల్లులకు నెలకు సరిపడిన ఔషధాలను ఆయా గ్రామాల్లో అందజేస్తారు. అయితే సేవలు ప్రారంభించినప్పుడు 54 రకాల మందులను అందుబాటులో ఉంచగా ప్రస్తుతం 33 రకాల మందులను మాత్రమే ఇస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర మందుల కోసం దీర్ఘకాలిక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తున్నది. ముఖ్యంగా గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులు, ఇతరుల సహాయంతో మాత్రమే వెళ్లగలిగే వారికి 104 వాహనాలు వరప్రదాయనిగా సేవలందించాయి. ప్రస్తుతం వీటి నుంచి సేవలు తగ్గుతుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు పాడై వాహనాల మరమ్మతుల విషయంలో రూ.50 వేల లోపు ఖర్చయ్యే వాటినే చేయిస్తూ మిగిలిన వాటిని పక్కన పెడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. గతంలో రెండు వాహనాలకు ముగ్గురేసి సిబ్బంది ఉండేవారు. దీంతో ఒకరు సెలవులో ఉన్నా వాహనాలు గ్రామాలకు నిరంతరాయంగా వెళ్లేవి. ప్రస్తుతం ఒక వాహనానికి ఒకరే అన్న నిబంధన అమలు చేస్తుండడంతో సిబ్బంది సెలవులో ఉన్నప్పుడు ఆ వాహనాలను మూలకు పెట్టేస్తున్నారు. గతంలో వాహనంతో ముగ్గురేసి ఏఎన్ఎంలు సేవలందించగా వారిని తిరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి వేశారు. క్రమక్రమంగా సేవలను తగ్గిస్తుండడంతో 104 సేవల కొనసాగింపుపై ప్రజలు, సిబ్బందిపై ఆందోళన పెరుగుతున్నది.
KCR, government, Telangana, 104, services, villages, health, staff, medicines, salaries, problems, galore
ఆర్నెళ్లుగా జీతాలు లేవు…
పదేండ్లకు పైగా గ్రామాల్లో ప్రాణాంతక జబ్బులకు గురైన వారికి సమయానికి మందులనిచ్చిన సిబ్బందికి చివరకు పస్తులు, అప్పులు మిగిలాయి. కొత్త జిల్లాలు నారాయణపేట, ములుగు జిల్లాల్లో గత ఆర్నెల్లుగా, మిగిలిన జిల్లాల్లో గత ఐదు నెలలుగా జీతాలు రాలేదు. అరకొర జీతంతో బతుకులు వెళ్లే దీసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి బ్రతుకు వెళ్లదీసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 198 వాహనాలుండగా వాటిలో 1336 మంది పని చేస్తున్నారు. 2008 లో ప్రభుత్వం 95 శాతం, హెల్త్ మేనేజ్ మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ (హెచ్ఎంఆర్ఐ) 5 శాతం భాగస్వామ్యంతో సేవలు ప్రారంభించింది. 2010 తర్వాత సిబ్బంది సమ్మె చేపట్టడంతో ఉద్యోగులను డీఎంహెచ్ఓ, కలెక్టర్ పరిధిలోకి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు, సీనియారిటీ పరిగణలోకి తీసుకొని జిల్లాల వారీగా నియమించారు. అయితే వీరి జీతాలను మాత్రం డీఎంహెచ్ఓ ప్రతిపాదనలు పంపిస్తే కలెక్టర్ విడుదల చేశాక జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఏజెన్సీలు చెల్లిస్తున్నాయి. దీనిపై ఉద్యోగులు కొంత మంది కోర్టులో వేసిన కేసులు విచారణలో ఉన్నాయి. నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని, అది కూడా ఏ నెలకు ఆ నెల చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కేటాయింపులు పెంచాలి
కె.యాదానాయక్ (తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు) 104 ఎఫ్ డీహెచ్ఎస్ సర్వీసుల బలోపేతానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలి. 2019-20 బడ్జెట్ లో కేటాయించిన రూ.15 కోట్లతో సేవలందిం చడం కష్టం. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా సమస్యగా మారుతుంది. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలి. త్వరలో అమలయ్యే పీఆర్సీని వర్తింపచేయాలి. ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించాలి. రోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలి. వాహనా లకు మరమ్మతులు ఒకటో చేయించాలి. డీఏ పెంచాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో రిలీవర్ స్టాఫ్ను నియమిం చాలి.