పరేడ్ గ్రౌండ్ స్టేషన్ కు మరమ్మతు
అమీర్ పేట మెట్రో స్టేషన్ ప్రమాద ఘటన తర్వాత నిర్మాణపరమైన లోపాల సవరణపై ఎల్ అండ్ టీ మెట్రో దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 10 స్టేషన్లలో లోపాలను గుర్తించి వాటిని సవరించింది. అమీర్ పేట స్టేషన్ పై నుంచి పెచ్చులూడి ప్రయాణికురాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భద్రతాపరమైన అంశాలను కమిషన్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్ఎస్) ప్రత్యక్షంగా పరిశీలించింది. మిగతా స్టేషన్లపై సమీక్షించింది. ఇటు ప్రభుత్వం, అటు సీఎంఆర్ఎస్ ఆదేశాలతో అన్ని స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన లోపాలకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్ అండ్ టీ మెట్రో ఇందుకోసం ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి తర్వాత ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బూమ్లిప్స్ ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రతి స్టేషన్ నిర్మాణానికి సంబంధించి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. అనుభవజ్ఞులైన ఇంజినీరింగ్ బృందాలు.. భద్రతే ప్రధానంగా ఎక్కడా రాజీపడకుండా పరిశీలించి లోపాలను సవరిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు సవరించిన లోపాలివే
* బాలానగర్ మెట్రో స్టేషన్ ‘బి’ వైపు పిట్టగోడ ప్లాస్టర్ పగుళ్లు ఏర్పడ్డాయి. వాటిని పూడ్చారు
* పరేడ్ గ్రౌండ్ స్టేషన్ ‘ఏ’ వైపు రెయిలింగ్ గోడ వద్ద కాంక్రీట్ లేచి ప్రమాదకరంగా మారింది. దీన్ని పూడ్చి సరిదిద్దారు.
* రసూలపురా స్టేషన్ ‘సి’ వైపు పిట్టగోడ ఇటుకలు వేలాడుతున్నాయి. వీటిని తొలగించి తిరిగి బిగించారు.
* హైటెక్ సిటీ స్టేషన్ లెడ్జ్ స్లాబ్ చివర్లో ప్యాచ్లు వదులయ్యాయి. వీటిని తొలగించి తిరిగి పూతపూశారు.
* గాంధీభవన్ స్టేషన్ గ్రిడ్ ‘కె’ మెట్ట ప్రాంతంలో లూజ్ కాంక్రీట్ ను గుర్తించారు. దీన్ని తొలగించి సరిచేశారు.
* ఎలిబీనగర్ స్టేషన్ మెట్ల మార్గం పైన పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిపై సిమెంట్ పూతతో సరిచేశారు.
* న్యూమార్కెట్ స్టేషన్ ‘బి’ వైపు కాన్ కోర్స్ అంతస్తులో లూజ్ మెటీరియల్స్ గుర్తించి తొలగించారు. గ్రిడ్ ‘ఏ’ కుడివైపున వేలాడుతున్న ఫైవుడ్ ను తొలగించారు.
* ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టేషన్ గ్రిడ్ ‘ఏ’ కుడివైపు బయటి భాగంలో లూజ్ ప్లాస్టర్ సామగ్రిని గుర్తించి తొలగించారు.
* తార్నాక, మూసాపేట స్టేషన్లలోనూ లోపాలను గుర్తించి సరిచేశారు.
Courtesy Eenadu..