సాపేక్షంగా తక్షణ సవాళ్లు చాలా వున్నాయి. రిజర్వు బ్యాంకు వెంటపడి నిల్వ నిధులు తెచ్చుకునేంత సంక్షోభంలోనూ కార్పొరేట్లకు వారంలో రెండున్నర లక్షల కోట్ల సమర్పణం, నిరుద్యోగం పదిశాతం దాటుతున్నా నిశ్చేతనంగా వుండిపోవడం, గ్రామస్వరాజ్యం వ్యవసాయ సంక్షోభంలో మంటగలిసిపోతున్నా మార్పు రాకపోవడం వంటివి కొన్ని ఉదాహరణలు. అప్పటి భాషలో మహాత్ముడు బోధించిన హరిజనోద్ధరణ జరగకపోగా అంటరానితనం కూడా కొనసాగుతున్నదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయన నూటయాభయ్యవ జయంతి రోజునే పత్రికల్లో రావడం… ఇవీ అసలైన సవాళ్లు.
గాంధీజీ 150వ జయంతి రోజు ప్రధాని మోదీ విసిరిన ఐన్స్టీన్ సవాలు వాస్తవానికి గాంధేయ బహుముఖీన వారసత్వాన్ని గౌరవించేవారికి సవాలే. ఐన్స్టీన్ మహాశాస్త్రజ్ఞుడు, ఈయన మహాత్ముడు. ఈ భూమి మీద ఇలాటి ఒక మనిషి రక్తమాంసాలతో సంచరించాడంటే నమ్మడం కష్టం అని గాంధీ గురించి ఐన్స్టీన్ అన్న మాటలు ప్రపంచ ప్రసిద్ధం. తను నాయకత్వం వహించిన స్వాతంత్ర్య పోరాటం జయప్రదమైనా ఏ అధికార వ్యవస్థలోనూ భాగం పంచుకోకుండా వుండిపోయిన నేత చరిత్రలో మరొకరు కనిపించరు. పైగా ఆ స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా మతకలహాల మంటలు చల్లార్చేందుకు తన నైతిక శక్తినే ఆయుధంగా ప్రయోగించి ఆపగలిగిన సాహసం సంకల్పబలం వూహకందవు. అంతటి త్యాగ సాహసాల ప్రతిరూపమైన గాంధీజీ మౌలికంగా విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సేనాని. జన బాహుళ్యంలోకి ఆ భావనను తీసుకెళ్లడంలో కృతకృత్యుడైన వ్యూహకర్త. సేవానిరతి, నిరాడంబరత, త్యాగశీలత, సచ్ఛీలత, దేశభక్తి ఇవన్నీ గాంధేయ విలువలుగా పెంపొందాయి. అహింస సత్యాగ్రహంవంటి ఆయన పోరాట పద్ధతులు చాలవని భావించిన వారున్నారు గాని మౌలికంగా ఆయన అత్యున్నత స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.
విదేశీవస్త్ర దహనం సంకేత ప్రాయంగా దేశీయ ఉత్పత్తులు పెంచుకోవాలన్న సందేశమిచ్చింది. హిందూ ముస్లిం ఐక్యతకోసం గాంధీజీ ‘ఈశ్వర్ అల్లా తేరేనాం’ అని గానం చేశారు. మత సామరస్యం గాంధీజీ జీవిత సందేశాలలో ప్రధానమైంది కాగా అటు ఆరెస్సెస్ నేతలు హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్, వారి ప్రేరకులైన వినాయక్ దామోదర్ సావర్కార్ వంటి వారు ఒకవైపు, తర్వాతి కాలంలో ముస్లింలీగ్ నేత మహమ్మదాలీ జిన్నా మరోవైపు మతంపైనే రాజకీయాలు నిర్మించుకున్నారు. ద్విజాతి సిద్ధాంతం తీసుకొచ్చారు. నా జాతీయ వాదం సావర్కార్, జిన్నాల వాదాలకు భిన్నమైందని గాంధీజీ కరాచీ కాంగ్రెస్ తీర్మానం ప్రవేశపెడుతూ స్పష్టంగా ప్రకటించారు. బ్రిటిష్ వారి వ్యూహాలతో దేశ విభజన అనివార్యమైనప్పుడు కూడా ఆయన మత సామరస్యానికే పరితపించారు. నౌఖాలిలో మంటలార్పడానికి శాంతి దూతగా పనిచేశారు. అది సహించలేకనే సావర్కార్ శిష్యుడు, పూర్వపు ఆరెస్సెస్ అనుయాయి, కరుడుగట్టిన హిందూత్వ వాది నాథూరాం గాడ్సే 1948 జనవరి 30న ప్రార్థనా వేదికపైనే ఆయనను కాల్చి చంపాడు. జనవరి 30న మత సామరస్య దినం పాటించడం రివాజుగా మారింది. గాంధీనే హతమార్చేలా గాడ్సేను ప్రేరేపించిన భావజాలాన్ని ఖండించి శాంతి సామరస్యాల సందేశం వాడవాడలా వినిపించడానికి మోదీ సిద్ధమైతే తప్పక ఐన్స్టీన్ సవాలును స్వీకరించినట్టే. గాడ్సేను పొగిడే ఎంపీలను తొలగించడం, తాము పాలించే యుపిలో గాడ్సే గుడి సంగతి చూడటం అందులో ముఖ్యమైనవి.
లక్షలాది శౌచాలయాలు నిర్మించి దేశంలో బహిరంగ మల విసర్జనే లేకుండా చేశామంటున్న మోదీ ప్రకటనలో అతిశయముంది. స్వచ్ఛ భారత్ లక్ష్యం మంచిదే గాని ఆ శౌచాలయాలు నీళ్లులేక మూతపడుతున్నాయి. చాలా చోట్ల పట్టణాలు మురికి కూపాలుగానే వున్నాయి. గాంధీజీ ఎంతగానో తలుచుకున్న పారిశుద్ధ్య కార్మికులు ఇప్పటికీ మలాన్ని ఎత్తుతూనే వున్నారు. మ్యాన్హోల్స్లో మరణిస్తూనే వున్నారు. పారిశుద్ధ్య వృత్తిని తీసేయాలి గాని, మీరు వూడ్చడం పరిష్కారం కాదని అప్పట్లో అంబేడ్కర్ వాదించినా గాంధీజీ మాత్రం స్వయంగా ఆ పనిలోకి దిగేవారు. ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికుల పనిని మాన్పించలేకపోయిన ఈ దేశంలో మ్యాన్ హోల్స్లో మరణాలు చూస్తూనే వున్నాం. నగరాల శుద్ధి మాత్రం రాంకీ లాటి కార్పొరేట్లకు ఔట్సోర్సింగ్ ఇస్తూ పురపాలక ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. స్వచ్ఛభారత్ పేరిట సెలబ్రిటీలు ఫోటోల ముందు చీపుళ్లు పట్టుకుని ఫోజులిస్తున్నారు. దీనికి గాంధీ బొమ్మ లోగో వాడుకోవడం కూడా అపచారమే. గాంధీజీ చిత్రాన్ని స్వచ్ఛ భారత్కే పరిమితం చేయకుండా కక్ష భారత్ పోకడలను అడ్డుకుంటేనే ఐన్స్టీన్ సవాలు అందుకున్నట్టు. గాంధీ తర్వాతి స్థానంలో వుండి ప్రథమ ప్రధానిగా దీర్ఘకాలం సేవలందించిన జవహర్లాల్ నెహ్రూకు సర్దార్ పటేల్ను పోటీ పెట్టడం కూడా గాంధేయ భావనలకు సవాలే.
గాంధీజీకి పటేల్ సన్నిహితులే గాని పటేల్ మితవాదం తెలిసిన గాంధీజీ నవ భారతానికి నెహ్రూ అవసరమని భావించారు. దేశభక్తిలో లౌకిక తత్వంలో తక్కువ కాని పటేల్ జీవితాంతం కాంగ్రెస్ వాది తప్ప సంఘ పరివార్తో సంబంధం లేదు. అయోధ్యలో తలుపులు మూయించి వివాదాన్ని నిలిపేసింది పటేల్ ఉత్తరాల ప్రకారమేనన్నది చరిత్ర. ఏమైనా పటేల్ స్వాతంత్ర్యం తర్వాత మూడేళ్ల లోపే 1950లో చనిపో యారు. నెహ్రూ 18 ఏళ్లపాటు ప్రధానిగా పనిచేసి అలీన విధానం స్వావలంబన వంటి విధానాలు రూపొందించారు. రాజకీయంగా ఆయనలోనూ చాలా పొరబాట్లువుండొచ్చు. కాని స్వతంత్ర భారత దేశ పునాదులు, విధానాల రూపకల్పనలో నెహ్రూది గొప్ప స్థానం. ఆయన స్థానంలో పటేల్ను పెట్టే ప్రక్రియ మోదీ వచ్చాక శృతి మించింది. స్వాతంత్ర్య పోరాటంతోగాని నాటి ప్రజా స్రవంతులతోగాని ఆరెస్సెస్కు ఏ సంబంధం లేదు గనక పటేల్ను ముందు పెట్టుకుని నెహ్రూపై దాడిచేయడం వారి వ్యూహంగా మారింది. గుజరాత్లో పెట్టుబడిదారీ సదస్సు వేదికగా అనిల్ అంబానీ ద్వారా గాంధీజీ, పటేల్లతోపాటు మోదీని వారి సరసన కూచోబెట్టింది.
ఇటీవలనే ‘హౌడీ మోదీ’ వేడుక నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ఆయనను ‘డాడీ మోదీ’గా ప్రతిష్టించడం, దాన్ని ఒప్పుకోని వాళ్లు భారతీయులే కాదని మోదీ పిఎంఓలో మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించడం యాదృచ్ఛికమేమీ కాదు. అంచెలంచెలుగా గాంధీజీ వారసత్వానికి ఎసరు పెట్టిన మోదీజీ చివరకు ఆయన గౌరవ వర్ణనను కూడా లాగేసుకోవడం సహజ పరిణామమే. ఇంత జరుగుతున్నా– ఆఫ్రికా నుంచి రాగానే దేశమంతా పర్యటించి విమర్శనాత్మక వ్యాసాలు రాసినందుకు బ్రిటిష్ పాలకులు కేసులు పెడితే తలవంచడానికి నిరాకరించి శిక్షనే స్వీకరించిన స్వేచ్ఛా పిపాసి గాంధీజీ. అందుకు భిన్నమైన ప్రస్తుత పోకడ మీడియా రచయితల పీక నొక్కడం. ఇది కేంద్ర రాష్ట్రాల్లో ఇప్పుడు మామూలైపోయింది. అయినా ఈ దేశంలోని మేధావి వర్గంలో పెద్ద భాగం మౌనం వహిస్తున్నది. అనుకూల లేదా అవకాశవాద మీడియాకు ఇది పెద్ద సమస్యగా లేదు.
శుభ్రత నిరాడంబరత మాత్రమే గాక గాంధీజీ మౌలికంగా సామ్రాజ్యవాదాన్ని వివక్షను ఎదుర్కొని పోరాడారు గనుకనే గాందీని దేశ దేశాల ప్రజలు గౌరవిస్తున్నారు. ‘‘ఆ అర్ధనగ్న ఫకీరు వైస్రాయి భవనం మెట్లు ఎక్కి వచ్చి బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధి ఎదుట నిలవడం నేను వూహించలేను’’ అన్నాడు దురహంకారి చర్చిల్. ఉత్తరోత్తరా రవి అస్తమించని సామ్రాజ్యం అంతరించింది గాని స్వాతంత్ర్య పోరాటం తలవంచలేదు. కాని మొదట పొగిడిన నోటితోనే ట్రంప్
‘ఐ టోల్డ్ దోజ్ ఫెలోస్ టు వర్క్ అవుట్’ అని భారత పాక్ ప్రధానులను గురించి మాట్లాడినా మనకు బాధ లేదు. కనుక ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారమే సాపేక్షంగా తక్షణ సవాళ్లు చాలా వున్నాయి. రిజర్వు బ్యాంకు వెంటపడి నిల్వ నిధులు తెచ్చుకునేంత సంక్షోభంలోనూ కార్పొరేట్లకు వారంలో రెండున్నర లక్షల కోట్ల సమర్పణం, నిరుద్యోగం ౧0% దాటుతున్నా నిశ్చేతనంగా వుండిపోవడం, గ్రామస్వరాజ్యం వ్యవసాయ సంక్షోభంలో మంటగలిసిపోతున్నా మార్పు రాకపోవడం వంటివి కొన్ని ఉదాహరణలు. అప్పటి భాషలో మహాత్ముడు బోధించిన హరిజనోద్ధరణ జరగకపోగా అంటరానితనం కూడా కొనసాగుతున్నదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు గాంధీజీ నూటయాభయ్యవ జయంతి రోజునే పత్రికల్లో రావడం… ఇవీ అసలైన సవాళ్లు. మోదీ గారు వీటిని స్వీకరిస్తే మనం కూడా ఆయన సవాలుకు ప్రతిస్పందించవచ్చు.
తెలకపల్లి రవి